యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 11 : ఒకప్పుడు వర్షాలు కురుస్తున్నాయంటే ఊరంతా చెరువుల వద్దకు వెళ్లేది. చెరువు కట్ట ఎక్కడ గండి పడుతుందోనని రాత్రింబవళ్లు నిద్రలేకుండా కాపలా కాసేవారు. భారీ వర్షం కురిసిందంటే చాలు.. చెరువు కట్ట తెగి నీళ్లు వృథాగా పోయేది. నాటి పాలకులు చెరువులను పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. ఇప్పుడా పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. ఆలేరు నియోజకవర్గంలో రూ.139.51 కోట్లతో 534 చెరువులకు జీవం పోశారు. దాంతో చెరువులు వర్షం నీటితో నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు చెరువుల దుస్థితి ఎలా ఉండే.. ప్రస్తుతం ఎలా ఉన్నాయో చెప్పడానికి మోటకొండూర్ మండల కేంద్రంలోని ఊర చెరువు చక్కటి ఉదాహరణ.
అది 2013 నవంబర్. నాలుగు రోజులు భారీ వర్షాలు కురిశాయి. దాంతో మోటకొండూర్ మండల కేంద్రంలోని ఊర చెరువులోకి వరద పోటెత్తింది. దాదాపుగా చెరువు నిండింది. అయితే.. చెరువు కట్ట పటిష్టంగా లేకపోవడంతో గండి పడ్డది. చెరువులోకి వచ్చిన నీళ్లన్నీ వృథాగా పోసాగాయి. పరిస్థితిని పసిగట్టిన గ్రామస్తులు మట్టి బస్తాలను అడ్డుగా వేశారు. రెండ్రోజులుగా అక్కడే ఉండి ఎంత ప్రయత్నించినా ఊహించని నష్టం జరిగింది. చెరువులోకి రావాల్సిన నీళ్లు కట్ట తెగి వృథాగా పోయాయి. ఈ పరిస్థితి ఒక్క మోటకొండూర్లోనే కాదు.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేది. వర్షాలు కురిశాయంటే చెరువులు గండ్లు పడి నీళ్లే కాదు.. పలు ప్రాంతాల్లో ఊర్లకు ఊర్లు చెరువులను తలపించేది. చెరువు ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. వర్షాలు వస్తే సంతోషించాల్సిన రైతన్నలు ఎక్కడ చెరువు తెగి పోతుందోనని భయపడుకుంటూ ఎవుసం చేసేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మోటకొండూర్ ఊర చెరువు దాదాపుగా 10 సార్లు తెగిపోయింది.
2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమ సమయంలో కాకతీయుల కాలంలో కళకళలాడిన గొలుసుకట్టు చెరువులు తీవ్ర నిరాదరణకు గురయ్యాయని గుర్తించిన సీఎం కేసీఆర్.. వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గతంలో పలుమార్లు చెరువు కట్ట, కట్టు కాల్వలు తెగి చుక్క నీళ్లు లేకుండా పోయిన మోటకొండూర్ చెరువు మరమ్మతులకు మిషన్ కాకతీయ కింద 2015లో రూ. 97.50 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో చెరువు కట్ట పునరుద్ధరణ, పూడికతీత, పిచ్చి, కంప చెట్ల తొలగింపు, తూము, అలుగు మరమ్మతు పనులు చేపట్టారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ఆశించిన ఫలితాన్నిచ్చింది. రెండేండ్లుగా కురిసిన వర్షానికి చెరువు నిండుకుండను తలపిస్తున్నది. ఈ ఏడాది మూడు నెలలుగా మత్తడి దూకుతూనే ఉన్నా.. ఎక్కడా కట్టకు ఇబ్బంది కలుగలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆనందంతో వ్యవసాయం చేసుకుంటూ దండిగా వరి ధాన్యాన్ని పండిస్తున్నారు. సుమారు 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఊర చెరువు ఆయకట్టు సుమారు 200 ఎకరాలు. దీంతోపాటు చుట్టు పక్కల ఉండే మహబూబ్పేట, ఆరెగూడెం, గిరిబోయినగూడెం, రాయకుంట పల్లి, మేడికుంట పల్లి, దిలావర్పూర్, ఇక్కుర్తి, మాటూరు, వర్టూరు, చందెపల్లి, సింగారం గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు పుష్కలంగా పోస్తున్నాయి.
వర్షాధార ప్రాంతమైన ఆలేరు ప్రాంతానికి చెరువులే ఆదెరువు. నియోజకవర్గ వ్యాప్తంగా చెరువుల దుస్థితిని చూసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి చలించిపోయారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మిషన్ కాకతీయ ద్వారా రూ.139.51 కోట్లు మంజూరు చేయించి నియోజకవర్గ వ్యాప్తంగా 534 చెరువులను పునరుద్ధరించారు. చెరువుల పూడికతీత, కట్ట పటిష్టత, కంపచెట్ల తొలగింపు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణతో నేడు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. 2014కు ముందు నియోజకవర్గ వ్యాప్తంగా 25వేల ఎకరాల విస్తీర్ణం మాత్రమే సాగులో ఉండగా.. 2022-23 సంవత్సరంలో నియోజకవర్గంలోని 8 మండలాల పరిధిలో 1,50,195 ఎకరాలు సాగులోకి వచ్చాయి.
2014 ఎన్నికల్లో చెరువులను నీటితో నింపుతా.. సాగునీటికి ఢోకా లేకుండా చేస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ దయతో నెరవేర్చా. ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా, ఏ చెరువు చూసినా నీటితో స్వాగతం పలుకుతున్నాయి. నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక గోదావరి జలాలను ఆలేరుకు తీసుకురావాలన్న లక్ష్యం మిగిలి ఉంది. ఇప్పటికే గుండాల, తుర్కపల్లి, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి వారి చెంతకు గోదావరి జలాలు వచ్చాయి. ఆత్మకూరు(ఎం), మోటకొండూర్కు గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు బునాదిగాని కాల్వను నృసింహస్వామి జలాశయానికి అనుసంధానం చేశాం. రాజాపేటకు 15వ ప్యాకేజీ ప్రధాన కాల్వ ద్వారా, ఆలేరుకు అశ్వరావుపల్లి కాల్వ ద్వారా గోదావరి జలాలను తీసుకొస్తాం.
– గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్
మా తాతల నాటి నుంచి వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఊర చెరువు కింద మాకు 6 ఎకరాల భూమి ఉంది. గతంలో వర్షాలు వస్తే చెరువు కట్ట తెగిపోయి మా భూమిలో పంటలకు తీవ్ర నష్టం కలిగేది. అప్పట్లో దాదాపుగా 10 సార్లు చెరువు కట్ట తెగిపోవడం, గండి పడటం జరిగింది. అర్ధరాత్రి గండ్లు పడితే రాత్రికి రాత్రి లేసి గండ్లను మూసే పరిస్థితి ఉండేది. అప్పట్లో ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చారు. రెండేండ్లుగా చెరువు నిండానీళ్లు ఉన్నా.. ఎక్కడా గండ్లు పడలేదు. ఇప్పుడు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. రాష్ట్రంలో చెరువులకు జీవం వచ్చిందంటే సీఎం కేసీఆర్ పుణ్యమే. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశ రైతులంతా మా తీరుగా ఆనందంగా, హాయిగా వ్యవసాయం చేసుకుంటారు.
– బొబ్బలి చంద్రారెడ్డి, రైతు, మోటకొండూర్