భువనగిరికలెక్టరేట్, ఏప్రిల్ 13 : ఆటో డ్రైవర్ నిర్లక్షంగా అతివేగంగా వాహనాన్ని నడపడంతో చిన్నారి మృతి చెందగా మరో చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని మున్సిపల్ డంపింగ్యార్డులో గురువారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని మున్సిపల్ డంపింగ్యార్డులో అస్సాం రాష్ర్టానికి చెందిన వలస కూలీ ఆశ్రఅలీ తన కుటుంబంతో డంపింగ్యార్డులో నివాసముంటున్నాడు. గురువారం ఆశ్రఫ్అలీకి ఇద్దరు కుమార్తెలు అప్సనాఅహ్మద్(9), మహెనూర్ డంపింగ్యార్డు ప్రాంగణంలో ఆడుకుంటున్నారు.
మున్సిపాలిటీకి చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్ బానోత్ సురేశ్ చెత్తను డపింగ్ చేసేందుకు వస్తూ అతివేగంగా, అజాగ్రత్తతో వాహనం నడిపి డంపింగ్యార్డు గోడను ఢీకొట్టాడు. దాంతో గోడ ఒక్కసారిగా కూలి అక్కడే ఆడుకుంటున్న పిల్లలపై పడింది. దాంతో తీవ్రంగా గాయపడిన అప్సనా అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందింది. మహెనూర్కు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు.
పరామర్శించిన మున్సిపల్ చైర్మన్
భువనగిరి అర్బన్ : డంపింగ్ యార్డ్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాలికకు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి బాలిక ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బి.నాగిరెడ్డి ఉన్నారు.