అతివేగంతో అదుపు తప్పిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు చనిపోగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. పీఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన మద్దిమడుగు ప్రసాద్ (38), భార్య రమణమ్మ(35, కుమారుడు అవినాశ్(12)తో కలిసి హైదరాబాద్ నుంచి బైక్పై సొంతూరుకు వస్తుండగా ప్రమాదంలో ముగ్గురూ దుర్మరణం చెందారు. చింతపల్లి మండలం కురంపల్లి గ్రామానికి చెందిన పట్నం మణిపాల్ (18), వనం మల్లికార్జున్ (18), మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతితో అక్కంపల్లి, చదువుకుంటూ సరదాగా గడిపే ఇద్దరు ఇంటర్ విద్యార్థులతో దుర్మరణంతో కురంపల్లి విషాదంలో మునిగిపోయాయి.
మాల్, సెప్టెంబర్ 20 : రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ సమీపంలోని బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సతీశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన మద్దిమడుగు ప్రసాద్(38) కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి హైదరాబాద్లో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమారుడి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తమ స్వగ్రామంలో చికిత్స చేయించేందుకు వస్తుండగా చింతపల్లి మండల నసర్లపల్లి గేట్ సమీపంలోకి రాగానే చింతపల్లి మండలం కురంపల్లికి చెందిన పట్నం మణిపాల్(18), వనం మల్లికార్జున్(18)తో పాటు పులి పవన్, వరాల మణి కారులో కొండమల్లేపల్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ప్రసాద్ బైక్ను ఢీకొట్టిడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్తోపాటు ఆయన భార్య రమణమ్మ(35), కుమారుడు అవినాశ్(12)తోపాటు మణిపాల్, మల్లికార్జున్ మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కుమారుడు మృతి చెం దడంతో చిన్న కుమారుడు అనాథగా మారాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పెద్దఅడిశర్లపల్లి : చింతపల్లి మండలం నరసర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పీఏపల్లి మండలం అక్కంపల్లికి చెందిన దంపతులతో పాటు వారి పెద్ద కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అక్కంపల్లికి చెందిన మద్దిమడుగు ప్రసాద్ కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఉంటూ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ స్వగ్రామానికి పెద్ద కుమారుడు అవినాశ్, భార్య రమణతో కలిసి బైక్పై వస్తుండగా కారు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆ కుటుంబంలో చిన్న కుమారుడు ఒంటరిగా మిగిలాడు. మూడు రోజుల క్రితమే కుమారుడు అవినాశ్ పుట్టిన రోజు నిర్వహించారు.
దేవరకొండ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృతదేహాలను చూసి రోదించడంతో ఆ ప్రాంతమంతా శోక సంద్రంలో మునిగి పోయింది.
మృతి చెందిన అవినాశ్ డిండి గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు అఖిల్ గ్రామంలోనే చదువుతున్నాడు. సోమవారం అవినాశ్ పుట్టినరోజు ఉండడంతో హైదరాబాద్లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అక్కడే అందరూ కలిసి వేడుక జరుపుకొన్నారు. అనంతరం బుధవారం అఖిల్ను అక్కంపల్లికి బస్సుకు పంపించారు. మిగిలిన ముగ్గురు బైక్పై వస్తుండగా ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులతో పాటు అన్నను కోల్పోయిన అఖిల్ దేవరకొండ ఆస్పత్రి వద్ద బోరున విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ప్రమాదం వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. చిన్నారి అఖిల్ను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.