యాదాద్రి భువనగిరి, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : పేదలకు సొంతింటి నిర్మాణం ఓ కల. ఆ ఆకాంక్షను సాకారం చేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ముందుకొచ్చింది. గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి నిర్మాణం కోసం రూ. 3లక్షల సాయం అందించాలని భావించింది. ఈ మేరకు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలను కూడా అందించింది.
దాంతో లబ్ధిదారులు అప్పులు తెచ్చి, బంగారం కుదవబెట్టిన డబ్బుతో ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. దాంతో జిల్లాలో సుమారు 8,400 మందికి ఆర్థిక సాయం అందకుండా పోయినట్లయ్యింది. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతన్న పథకాన్ని అర్ధాంతంగా రద్దు చేయడం ఏంటని భగ్గుమంటున్నారు.
గృహలక్ష్మి తొలి విడుతలో భాగంగా యాదాద్రి జిల్లాకు 8,400 యూనిట్లు మంజూరు చేశారు. నియోజకవర్గానికి 3వేల చొప్పున యూనిట్లు కేటాయించారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం 34,750 దరఖాస్తులు వచ్చాయి. 24,291మందిని అర్హులను గుర్తించారు. దరఖాస్తుల ఆధారంగా తాసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి.. సమగ్ర జాబితా రూపొందించారు. పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తూ అర్హులను గుర్తించారు.
భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 3వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్లో, మోత్కూరు, అడ్డగూడూరులో 750, రామన్నపేటలో 400 మందిని ఎంపిక చేశారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి.. ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించారు. రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మూడు దశల్లో ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటి బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు దశలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక రూ. లక్ష చెల్లిస్తామని తెలిపారు.
గృహలక్ష్మి పథకం తొలుత మన దగ్గరే అమలైంది. తొలి లబ్ధిదారుగా భూదాన్పోచంపల్లి మండలంలోని కనుముక్కులకు చెందిన చుక్కా పావని అనే చేనేత కార్మికురాలు నిలిచింది. ఆగస్టు 12న పోచంపల్లికి వచ్చిన అప్పటి మంత్రి కేటీఆర్ను కలిసి తమకు ఇల్లు లేదని, ఆశ్రయం కల్పించాలని పావని విజ్ఞప్తి చేసింది. గృహలక్ష్మి పథకాన్ని ఆమెకు వెంటనే వర్తింపజేయాలని కేటీఆర్ ఆదేశించడంతో అధికారులు
ప్రొసీడింగ్ ఆర్డర్ అందించారు.