నల్లగొండ, నవంబర్ 7: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సాగునీటితోపాటు 24 గంటల కరెంట్, పంట పెట్టుబడికి రైతు బంధు సాయం వంటివి అమలు చేస్తున్నది. దాంతో స్వరాష్ట్రంలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొంటున్నది. తొమ్మిదేండ్లుగా ప్రతి సంవత్సరం రెండు పంటల ధాన్యం సేకరించి వారం పదిరోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. ఈ వానకాలం పంటను కూడా కొనుగోలు చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండలో 10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేయగా 746 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1.42 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై ఉన్నది. అయినా ధాన్యం కొనుగోళ్లలో లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నది.
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తూ తొమ్మిదేండ్లుగా కొనుగోలు చేస్తున్నది. ఓ వైపు ప్రతి ఎకరాకు రూ.10వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందిస్తూనే మరోవైపు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నది. 2014 వానకాలం సీజన్ నుంచి మొదలు ఈ సంవత్సరం వానకాలం సీజన్ వరకు కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తున్నది. నాడు 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగా నేడు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నది. ప్రతి సీజన్లో ప్రభుత్వరంగ సంస్థలైన పీఏసీఎస్, ఐకేపీతో పాటు మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. సివిల్ సైప్లె యంత్రాంగం రైతులు ధాన్యం విక్రయించిన పక్షం రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలీన్లు, తేమ కొలిచే, తూకం యంత్రాలను మార్కెటింగ్, సివిల్ సప్తై శాఖలే సమకూరుస్తున్నాయి. రైతు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళితే ప్రభుత్వ రంగ సంస్థలే కొనుగోలు చేసి డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నాయి. దాంతో దళారుల ప్రమేయం పూర్తిగా పోయింది.
తొమ్మిదేండ్లలో 9.10 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గడిచిన తొమ్మిదేండ్లలో 9.10 లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగింది. 2014లో యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,44,687 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది యాసంగి సీజన్లో 13,54,750 ఎకరాల్లో వరి సాగైంది. నాడు హెక్టారుకు 6.25 మెట్రిక్ టన్నుల చొప్పున 11,11,718 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కావాల్సి ఉండగా సాగు నీటి వనరులు సరిగ్గా లేక 60 శాతం మాత్రమే పంట దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 71 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టగా స్థానిక అవసరాలు పోను 61 వేల మెట్రిక్ టన్నులు మార్కెట్కు రావటంతో ప్రభుత్వం రూ.26.29 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 2023 యాసంగి సీజన్లో జిల్లాలో 13,54,750 ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం పుష్కలంగా నీటి వనరులు ఉండటంతో ఒక్క గుంట వరిపైరు కూడా ఎండిపోలేదు. ఫలితంగా 33,85,875 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఇందులో స్థానిక అవసరాలు పోను 12.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తే 746 కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.2,255 కోట్లు వెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు చేసి ఎగుమతి చేసిన వారం, పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.
ముమ్మరంగా వానకాలం ధాన్యం కొనుగోళ్లు
ప్రస్తుతం వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11, 54,750 ఎకరాల్లో వరి సాగు చేయగా 28,86,875 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో మిల్లర్ల కొనుగోలు, స్థానిక అవసరాలు పోను ప్రభుత్వ రంగ మార్కెట్లకు 10.55 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ధానాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొనుగోళ్ల సమయంలో రైతుల ఆధార్ కార్డును లింక్ చేసి బయోమెట్రిక్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 746 ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. టార్పాలిన్లు, తేమ యంత్రాలు, ప్యాడీక్లీనర్లు, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు, మార్కెటింగ్, సివిల్ సైప్లె శాఖలు సమకూర్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి క్వింటా ధాన్యానికి మద్దతు ధర ఏ గ్రేడ్ అయితే రూ.2,203, కామన్ అయితే రూ.2,183గా నిర్ణయించి కొనుగోలు చేస్తున్నది.
10 శాఖల భాగస్వామ్యం
జిల్లా వ్యాప్తంగా ప్రతి సీజన్లో10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి. ఈ ధాన్యం కొనుగోలు చేసేందుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఐకేపీ, సహకారశాఖ ఆధ్వర్యంలో పీఏసీఎస్లు జిల్లా వ్యాప్తంగా 675 నుంచి 750 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనేది మూడు శాఖలు అయినా ప్రక్రియ మాత్రం 10 శాఖలు నిర్వర్తిస్తున్నాయి. ఈ సారి ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగకుండా ఉండేందుకు, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూసేందుకు ప్రతి రైతు ఆధార్ కార్డును లింక్ చేసి బయోమెట్రిక్ చేసిన తర్వాతనే ధాన్యం తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు.
ఓ వైపు ఎన్నికల విధులు.. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించి సకాలంలో కొనుగోలు చేయడంలో అధికారులు కృషి చేస్తున్నారు. సుమారు రెండున్నర నెలల పాటు ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనుసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తుంటారు. ఈ సారి సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఒక వైపు ఎన్నికల విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాల్సి వస్తున్నది. ఇందులో సివిల్ సైప్లెతో పాటు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, సహకార శాఖలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తున్నది.
వర్షాలకు ధాన్యం తడువకుండా చర్యలు ; సివిల్సైప్లె జిల్లా మేనేజర్ నాగేశ్వర్రావు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతుల ధాన్యం తడువకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర సరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ డి.నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు అధైర్య పడొద్దని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. పౌరసరఫరాల డిప్యూటీ తాసీల్దార్లు క్షేత్రస్థాయిలో ఉండి ఏపీఎంలు, మానిటరింగ్ అధికారులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోళ్లు
వానకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు ఇబ్బంది లేకకుండా చర్యలు తీసుకుంటున్నాం. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. దీనిని డీఆర్డీఏ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు 274 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే గన్నీ బ్యాగులు, తేమ, తూకం యంత్రాలు సమకూర్చాం. ప్రస్తుతం ఎన్నికల విధులు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలుగవద్దనే కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగేలా చేస్తున్నాం.
-వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి, నల్లగొండ