Yadagiri Gutta | యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం చివరి ఆదివారం, సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో దంపతులు పాల్గొన్నారు. మాఢ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. సుమారు 70 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఖజానాకు రికార్డు స్థాయిలో రూ.1,09,40,868 ఆదాయం సమకూరింది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత గతేడాది కార్తిక మాసంలోనూ ఇదే మాదిరిగా భక్తులు పెద్ద సంఖ్యలో రాగా ఇది రెండోసారి.
యాదగిరిగుట్ట, డిసెంబర్ 10 : పంచనారసింహుడి క్షేత్రం యాదగిరిగుట్ట ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తుల కనిపించారు. ‘నమో నారసింహయా’ అంటూ స్వామిని దర్శించుకుని పులకించిపోయారు. కార్తీక మాసం చివరి ఆదివారంతో పాటు సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. వీఐపీ, బ్రేక్ దర్శనాల్లో 3,618మంది భక్తులు పాల్గొనడం విశేషం.
ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్ మూడు అంతస్తులతో పాటు క్యూలైన్లు నిండిపోయాయి. వీవీఐపీ దర్శనానికి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రసాద విక్రయశాలతో రూ.34,31,490 ఆదాయం సమకూరింది. కొండపైకి వాహనాల రద్దీ సాగింది. పార్కింగ్ ప్రాంతంతో పాటు కొండపై వివిధ ప్రాంతాల్లో వాహనాలతో రద్దీగా మారింది. దీంతో భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వెంటనే స్పందించిన ఆలయ అధికారులు, పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను రద్దీని అదుపులోకి తీసుకొచ్చారు. స్వామి వారి ధర్మ దర్శానికి 5గంటలు, వీఐపీ దర్శనానికి 4గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1594 మంది భక్తులు వ్రత పూజల్లో పాల్గొన్నారని తెలిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు.
ప్రధానాలయ ముఖ మండపంలో శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని సుమారు 70వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.1,09,40,868 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తెలిపారు.