గతంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు విసిరేసినట్లుగా ఉండేవి. వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు అటూ ఇటూ తిరుగడంతోనే సరిపోయేది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురయ్యేవి. దీనికి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొత్త కలెక్టరేట్ ప్రారంభం కాగా శాఖలన్నీ ఒకేచోటుకి వచ్చాయి. 46 శాఖలకుగానూ ఇప్పటికి 44 శాఖలు కొలువుదీరాయి. అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే పాలన సాగిస్తుండడంతో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతున్నాయి.
సూర్యాపేట, సెప్టెంబర్ 6 : ప్రజలకు సౌలభ్యంగా, పాలనకు అనువుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించింది. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు, ప్రజలతో కళకళలాడుతున్నది. జిల్లాలోని 46 శాఖలు పాలన అందించే విధంగా ఏర్పాట్లు చేయగా ఇప్పటి వరకు 44 శాఖలు సమీకృత కలెక్టరేట్కు వచ్చేశాయి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా కొన్ని శాఖలు ప్రైవేట్ భవనాలకు అద్దెలు చెల్లించే బాధలు తప్పాయి. పాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది.
నూతన జిల్లాల్లో సైతం ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండడం కోసం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా 2017 అక్టోబర్ 12న సూర్యాపేట నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసిన కలెక్టరేట్లలో సూర్యాపేట కలెక్టరేట్ రెండోవది నిలిచింది. జిల్లా కేంద్రంలోని 2వ వార్డు కుడకుడ సమీపంలో 21 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.65 కోట్ల వ్యయంతో కలెక్టరేట్ నిర్మాణం, అధికారుల నివాస సముదాయాలను చేపట్టారు. దాదాపు 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ ఫ్లోర్లతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది.
ఆగస్టు 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభం జరిగింది. ప్రారంభమైన మొదటి రోజు నుంచే కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచే పాలన కొనసాగించారు. దాదాపు 35 శాఖలు ఉండే విధంగా భవనం డిజైన్ చేయగా ఉద్యోగుల సంఖ్యను బట్టి దాదాపు 46 శాఖలు ఇక్కడ నుంచి పాలన సాగించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 44 శాఖలు ఇక్కడికి రాగా మరో రెండు శాఖలు ఒకటి రెండు రోజుల్లో రానున్నాయి.
ప్రజలకు అందుబాటులో ఉండేందుకే : కలెక్టర్ వెంకట్రావ్
ప్రజలకు అన్ని శాఖలు ఒక సముదాయంలో ఉండడం వల్ల పనులు త్వరగా అవుతాయని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన వన, ఉపాధి కల్పన, పరిశ్రమలు, ఆడిట్, సర్వే ల్యాండ్స్ కార్యాలయాలను ప్రారంభించి అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం సమీకృత కార్యాలయాలను నిర్మించిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి అన్ని శాఖల కార్యాలయాలను ఇక్కడికి తరలించడం జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం జిల్లా అధికారులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా అధికారులు రామారావునాయక్, శ్రీధర్గౌడ్, వెంకటేశ్వర్లు, మాదవరెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.