యాదాద్రి భువనగిరి, జూలై 7 (నమస్తే తెలంగాణ)/భూదాన్ పోచంపల్లి: తెలంగాణలో చేనేత పరిశ్రమపై ఆధారపడి 40 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అత్యధికంగా పోచంపల్లిలో నేత కార్మికులు ఉన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులను నమ్ముకొని మగ్గాలపై చీరలు, చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేస్తూ పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేనేత సాంకేతిక కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో కోర్సులు లేకపోవడంతో ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యాసంస్థగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ)కి పేరుంది. విద్యకు ఐఐటీ మాదిరిగా చేనేతకు ఐఐహెచ్టీని పరిగణిస్తారు. పైగా ఐఐహెచ్టీల్లో కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్టీని నెలకొల్పాలని అన్ని వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి 2017లో ప్రతిపాదనలు పంపింది. ఏండ్లు గడుస్తున్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందించకపోవడంతో పలువురు చేనేత కార్మికులు మోదీ సర్కారుపై మండిపడుతున్నారు.
నేరుగా కలిసిన మంత్రి కేటీఆర్
ఐఐహెచ్టీకి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని మంత్రి కేటీఆర్ అనేక విధాలుగా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ దీనిపై మాట్లాడుతున్నారు. అనేక సార్లు కేంద్ర మంత్రులకు స్వయంగా లేఖలు రాశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్టీ ఏర్పాటుపై విన్నవించారు. అయినప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ఐఐహెచ్టీ లేక తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, అసోం, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లో ఐఐహెచ్టీలు ఉన్నాయి. ఇటీవల పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్కు కూడా కేంద్రం ఐఐహెచ్టీని మంజూరు చేసింది. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నది.
ఇప్పటికీ పాత పద్ధతులే
నేను 30 ఏండ్ల నుంచి మగ్గం నేస్తున్న. సంప్రదాయ విధానాల్లోనే చీరలు నేస్తున్నాం. నాతోపాటు చాలా మంది నేత కార్మికులు పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. ఐఐహెచ్టీ నెలకొల్పితే అన్ని విధాలుగా లాభం కలుగుతుంది. కేంద్రం మొండికి పోకుండా పోచంపల్లిలో ఐఐహెచ్టీ ఏర్పాటు చేయాలి.
-తడక రమేశ్, చేనేత టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు
పరిశ్రమ బలోపేతం అవుతుంది
ఐఐహెచ్టీ ఏర్పాటు చేయడం ద్వారా చేనేత పరిశ్రమ పుంజుకుంటుంది. వస్త్రాల తయారీలో కొత్తదనం, డిజైన్ రూపకల్పనతోపాటు నాణ్యత పెరుగుతుంది. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి. కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల మేరకు వస్త్రాలను తయారు చేసే అవకాశం ఉంటుంది.
-అంకం పాండు, చేనేత సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు