జిల్లావ్యాప్తంగా నాటుకుంటున్న మొక్కలు
లక్ష్యం దిశగా హరితహారం
వారంలోనే 40శాతం ప్లాంటేషన్ పూర్తి
రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం
కలెక్టర్ పమేలా సత్పతి స్పెషల్ ఫోకస్
వివిధ శాఖల సమన్వయంతో ముందుకు..
నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
10 రోజుల్లో లక్ష్యం చేరుకుంటామంటున్న యంత్రాంగం
పుడమికి పచ్చల హారం తొడిగి అటవీ విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో వడివడిగా సాగుతున్నది. ఎనిమిదో విడుత లక్ష్యం 28.83లక్షల మొక్కలు కాగా, ఇప్పటికే 10.60లక్షల మొక్కలు భూమిలో నాటుకుంటున్నాయి. వారం రోజుల్లోనే 40శాతం లక్ష్యం పూర్తిచేసుకుని జిల్లా మూడోస్థానంలో నిలిచింది. వరుణుడి కరుణతో ఊరూవాడ ఉత్సాహంగా మొక్కల నాటింపు కొనసాగుతున్నది. శాఖల సమన్వయంతో మరో పది రోజుల్లో నూరు శాతం లక్ష్యం చేరుకోనున్నట్లు అధికార యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తున్నది.
యాదాద్రి భువనగిరి,జూలై 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 28.83 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే ఈనెల 12 వరకు 10.60 లక్షల మొక్కలు నాటగా ఇంకా 18.23 లక్షల మొక్కలు నాటాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మొక్కలు నాటిన జిల్లాల్లో యాదాద్రి భువనగిరికి మూడో స్థానం దక్కింది. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మొదటి, రెండో స్థానంలో నిలిచాయి.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..
హరితహారంలో నాటే మొక్కల్లో 85 శాతం బతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. మొక్కలు బతుకకుంటే వార్డు సభ్యులు, సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ అందించింది. వీటితో ఏడాది పాటు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. నర్సరీల నుంచి మొక్కలను సరఫరా చేస్తుండగా, అడవులు, రహదారులు, గ్రామపంచాయతీలు, స్కూల్ గ్రౌండ్స్, రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా, జంతువులు తినకుండా ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ..
జిల్లాల్లో హరితహారం మొక్కల సంరక్షణపై కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా దృష్టి సారించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఆయా శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, రూరల్ డెవలప్మెంట్, హర్టీకల్చర్, ఎక్సైజ్. అగ్రికల్చర్, ఫారెస్ట్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్ తదితర విభాగాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. అత్యధికంగా రూరల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 6.10 లక్షల మొక్కలు నాటారు.
ప్రతి మొక్కనూ సంరక్షించాలి
ఎంపీపీ జ్యోతీబలరాం
రామన్నపేట, జూలై 13 : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం అన్నారు. బుధవారం మండలంలోని కక్కిరేణిలో ఇంటింటికీ మొక్కలను పంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్లలో పండ్ల, పూల మొక్కలను విరివిగా పెంచాలని సూచించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి మహేశ్ ఉన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు
చౌటుప్పల్, జూలై 13 : ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. హరితహారంలో భాగంగా పట్టణంలోని జాతీయ రహదారి పక్కన బుధవారం ఆయన మొక్క నాటారు. వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్లు కొయ్యడ సైదులుగౌడ్, ఆలె నాగరాజు, కాసర్ల మంజుల, పోలోజు శ్రీధర్బాబు, కామిశెట్టి శైలజ, ఇన్చార్జి మేనేజర్ వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, ఈఈ రేణుకుమార్ పాల్గొన్నారు.
మరో పది రోజుల్లో లక్ష్యం పూర్తి..
జిల్లాల్లో 28.83 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నం. ఇప్పటికే 40 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. అన్ని విభాగాల సమన్వయంతో ఇది సాధ్యమైంది. రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. మరో 10 రోజుల్లో పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటాం.
– డీవీరెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి