యాదాద్రి భువనగిరి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలకే భానుగు భగ్గమంటున్నాడు. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు.
మంగళవారం 40.8 డిగ్రీల గరిష్ఠ, 27.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మార్చిలోనే ఇలా ఉంటే మరో రెండు నెలలు పరిస్థితి ఏంటని జనం బెంబేలెత్తుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎండల నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.