హాలియా, జూన్ 19 : మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి సోమవారం తన సొంతూరి ప్రజలు షాక్ ఇచ్చారు. గత 40 ఏండ్లుగా తన రాజకీయ ఎదుగుదలకు అండదండగా ఉన్న అనుముల గ్రామస్తులు హాలియా మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన 40 కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ 2018కి ముందు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికలో కూడా జానారెడ్డి రిగ్గింగ్తోనే గెలిచాడే తప్ప.. ప్రజాబలంతో గెలువలేదని ఆరోపించారు. గత పాలకులు హాలియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజకీయం చేసేవారని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనలో హాలియాలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల్లో నేడు సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెడ్ యార్డ్, డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, ఎడమ కాల్వ మాజీ చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు, కౌన్సిలర్ ప్రసాద్నాయక్, కౌన్సిల్ సభ్యులు రావుల లింగమ్మ, మార్కెట్ డైరెక్టర్ సురబి రాంబాబు, దోరేపల్లి వెంకన్న, దుర్గారావు, జినకల ప్రసాద్, జానపాటి శ్రీనివాస్, బొడ్డుపల్లి ఈదయ్య, మహేశ్ పాల్గొన్నారు.