యాసంగి సాగుకు రైతాంగం సిద్ధమైంది. పల్లెల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగియడంతో రైతులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి సాగు కోసం దుక్కులు దున్నతూ బిజీ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరంతోపాటు మూసీ, నాగార్జునసాగర్ ఆయకట్టు కింద గత యాసంగిలో 5.45 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా, 75వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. ఈసారి నాగార్జునసాగర్ జలాశయంలో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు కింద సాగు ఆందోళనకరంగా మారింది. అయినా 4 లక్షల ఎకరాల్లో వరి, మరో 20వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు కావచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎరువులు అవసరమని భావిస్తూ, ఆ మేరకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా అన్నివర్గాల ప్రజలు ఎన్నికల కోలాహలంలో ఉండగా, ఇప్పుడు ఎన్నికలు పూర్తవడంతో ఆయా వర్గాలు తమ వృత్తులపై దృష్టి సారించాయి. ప్రధానంగా రైతన్నలు సాగు పనుల్లో బిజీ అవుతున్నారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలతోపాటు మూసీ ఆయకట్టు ఉండగా మరోపక్క నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 6,30,468 ఎకరాల సాగు భూమి ఉంది. అయితే నాగార్జునసాగర్లో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టులో సాగు కొంత ఆశాజనకంగా ఉండని పరిస్థితి. ఈ సారి నాలుగు లక్షల ఎకరాల వరకు వరి సాగులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
యాసంగి సాగు కోసం సూర్యాపేట జిల్లా రైతాంగం సిద్ధమవుతుంది. జిల్లాకు ఓ పక్కన ఉన్న నాగార్జునసాగర్లో నీళ్లు అడుగంటడంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని హుజూర్నగర్, కోదాడతోపాటు సూర్యాపేట నియోజకవర్గంలోని కొంత ఏరియా రైతాంగం నిరాశతో ఉంది. మరో పక్క కాళేశ్వరం జలాలు, మూసీ ఫుల్గా ఉండడంతో ఆయా ప్రాంతాల రైతులు సంతోషంగా ఉన్నారు. గతేడాది యాసంగిలో దాదాపు 5.45 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా మరో 75 వేల ఎకరాల వరకు ఇతర పంటలు సాగు చేశారు. అయితే ఈ సారి మాత్రం సాగర్ ఆయకట్టులో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంటలు పండించే అవకాశం ఉండగా ఇతరత్రా పంటలు దాదాపు 25 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
నవంబర్ మూడో వారం నుంచే జిల్లాలో రైతాంగం సాగుబాట పట్టగా, ఎన్నికల కారణంగా అన్ని వర్గాలతోపాటు రైతాంగం కూడా ఎన్నికల బిజీలో గడిపారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు పూర్తయినందున రైతులు సాగుబాట పడుతున్నారు. ఇప్పటికే దుక్కులు ప్రారంభం కాగా కొన్ని ప్రాంతాల్లో వరి నార్లు పోయడం, తుంగతుర్తి నియోజకవర్గంతోపాటు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా వేస్తున్నారు. ఈ మేరకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తెచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. 55 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 16,650 మెట్రిక్ టన్నుల డీఏపీతోపాటు ఇతరత్రా ఎరువులు కలిపి సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా ఎన్నికలు పూర్తయినందున ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న స్టాక్ లెక్కించి ఎంత అవసరమో అనే దానిపై ఇండెంట్ పెట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలిసింది.