చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 16 : కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు చెప్పించాలని రోజుకూలీకి వెళ్తున్న కష్టజీవులపైకి మృత్యుశకటం దూసుకువచ్చింది. పనికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టి నలుగురు మహిళా కూలీలను బలితీసుకున్నది. ఏ పిల్లల భవిష్యత్ కోసమైతే ఆ తల్లులు ఆశపడ్డారో వారికి అమ్మను దూరం చేసింది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద గురువారం జరిగిన ప్రమాదం మిగిల్చిన విషాదమిది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన మహిళా కూలీలు దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్లోని శ్వేత తెలుగు పుడ్స్ కంపెనీలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. పరిశ్రమలో పనిచేయడానికి రోజూ మాదిరిగా ఉదయం ఆటోలో ఏడుగురు కార్మికులు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్లోకి వస్తున్న అదే కంపెనీకి చెందిన ప్రైవేటు బస్సు ఇండస్ట్రీయల్ పార్క్ టీ జంక్షన్ వద్ద వేగంగా ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వారిని అంబులెన్స్లో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే ముగ్గురు మృతి చెందారు.
మరొకరు చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందారు. మృతి చెందిన వారిలో దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన డాకోజు నాగలక్ష్మి(30), సిలివేరు ధనమ్మ (35), పిట్టంపల్లి శిరీష(28), వరకాంతం అనసూయ(62) ఉన్నారు. ఆటో డ్రైవర్ కొండ వెంకటేశంతో పాటు మరో ముగ్గురు అఖిల, యామిని, కావ్య దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మృతులందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులంతా ప్రమాదం జరిగిన ప్రాంతానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. మృతుల్లో ఒకరైన అనసూయ భర్త రాంరెడ్డి వ్యవసాయం చేస్తున్నాడు. అలాగే శిరీషకు కొడుకు ఉన్నాడు. ఆమె కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. భర్త ఎలక్ట్రిషన్గా పనిచేస్తున్నాడు. శిరీష కొడుకు కొయ్యలగూడెంలోని ప్రైవేటు స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు.
అమ్మ వచ్చినాక అన్నం తినిపిస్తది
మృతుల్లో డాకోజి నాగలక్ష్మి భర్త రమేశ్ కొయ్యలగూడెంలో హెయిర్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కుమార్తె. పెద్ద కుమారుడు నిఖిల్ కొయ్యలగూడెం ఓ ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి, సాత్విక్ 2వ తరగతి, సమీక్ష ఎల్కేజీ చదువుతున్నారు. అమ్మ పొద్దున్నే మమ్మలని తయారు చేసి బడికి పంపించింది. తర్వాత కూలి పనికెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చినాక అన్నం తినిపిస్తది. అంటూ అమాయకంగా నాగలక్ష్మి పిల్లలు చెప్పడం ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టించింది. – నాగలక్ష్మి పిల్లలు
సొమ్మసిల్లిన భర్త
ధనమ్మ భర్త భిక్షపతి బోరు బండి మీద పని చేస్తాడు పది రోజుల క్రితం వెళ్లి గురువారమే ఇంటికి వచ్చాడు. అప్పటికే ధనమ్మ కూలీ పనికి వెళ్లింది. వెళ్లినా గంటలోపే ప్రమాదానికి గురైనట్లు తెలువడంతో బోరున విలపించారు. ధనమ్మ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతుండగా, కూతురు పదోతరగతి చదువుతున్నది. భార్య మృతదేహాన్ని చూసి భిక్షపతి సొమ్మ సిల్లి పోయాడు.