సూర్యాపేట, ఏప్రిల్ 27 : కంటి వెలుగుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. 2వ విడుత కార్యక్రమం ప్రారంభమైన 61 రోజుల్లో సూర్యాపేట జిల్లాలో 3,91,128 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 2,67,745 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 6వేలకు పైగా ప్రజలు కంటి వెలుగు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు 455 క్యాంపులు పూర్తయ్యాయి. 73,445 మందికి దగ్గరి చూపు అద్దాలు ఇచ్చారు. 49,873 మందికి దూరం చూపు అద్దాలు (ప్రిస్క్రిప్షన్ అద్దాలు) అవసరమని గుర్తించగా.. ఇప్పటి వరకు 35,162 అద్దాలు అందించారు.
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. కంప్యూటర్తోపాటు మ్యానువల్గా పరీక్షలు చేసి కంటి సమస్యను గుర్తించి వైద్యుడి సూచనల మేరకు వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 61 రోజుల్లో 3,91,128 మంది కంటి పరీక్షలు చేయించుకోగా.. వారిలో 2,67,745 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారిలో పురుషులు 1,85,297 మంది, మహిళలు 2,05,546, ఇతరులు 183 మంది ప్రభుత్వ కంటి వెలుగు క్యాంపుల్లో పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్నవారిలో ఎస్సీలు 73,905 మంది, ఎస్టీలు 48,124, బీసీలు 2,19,574, ఓసీలు 44,407, మైనార్టీలు 5,016 మంది ఉన్నారు.
1,23,318 మందికి అద్దాలు పంపిణీ
జిల్లాలో 1,28,318 మందికి దూరం చూపు, దగ్గరి చూపు సమస్యలు ఉన్నట్లు కంటి వెలుగు శిబిరాల్లో గుర్తించారు. దగ్గరి చూపు సమస్య ఉన్న 73,445 మందికి వెంటనే కండ్లద్దాలు అందజేశారు. దూరం చూపు ఉన్న 49,873 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరముండగా.. ఇప్పటి వరకు 35,162 మందికి ప్రత్యేకంగా తయారు చేయించిన అద్దాలు అందించారు. మరో 14,711 మందికి త్వరలోనే ఇవ్వనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న వారిలో అత్యధికంగా 40 సంవత్సరాలకు పైబడిన వారే ఉన్నారు. దాదాపు 62,684 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కంటి వెలుగు మొదటి విడుతలో జిల్లా వ్యాప్తంగా 5,76,231 మంది కంటి పరీక్షలు చేయించుకోవగా.. 1,04,574 మందికి కండ్లద్దాలు అవసరమయ్యాయి. ఈ సారి 3,91,128 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,28,318 మందికి అద్దాలు ఇవ్వాల్సి వచ్చింది. కంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయనడానికి ఇదే నిదర్శనం.
455 క్యాంపులు పూర్తి
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామాన, పట్టణాల్లోని అన్ని వార్డుల్లో కంటి వెలుగు క్యాంపులు ఏర్పాటు చేసింది. జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాల్టీల పరిధిలోని 141 వార్డుల్లో కలిపి వంద రోజుల్లో 616 క్యాంపులు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. పరీక్షల కోసం 50 కంటి వెలుగు టీమ్లను ఏర్పాటు చేశారు. 61 రోజుల్లో 475 గ్రామ పంచాయతీలకుగాను 314 పంచాయతీల్లో క్యాంపులు పూర్తి చేశారు. 5 పురపాలక సంఘాల పరధిలో 141 వార్డులుండగా.. అన్నింటిలో క్యాంపులు పూర్తయ్యాయి. పెద్ద వార్డుల్లో మరో మారు క్యాంపులు పెట్టి పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సగటున 6,200 నుంచి 6,400 మందికి కంటి పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్లో నిర్వహించగా సిమెంట్ పరిశ్రమల్లో చేపడుతున్నారు.