అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని, ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్ (ఎస్) మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్కు చెందిన సుమారు 360 మంది బీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందుకు బీఆర్ఎస్ అనుబంధ సంఘ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు.
దేశ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేసినప్పటి నుంచే కేంద్రం మరింత కక్ష కట్టిందని, ఇతర రాష్ర్టాల్లో తమ ఉనికి కోల్పోతామనే భయం బీజేపీ శ్రేణులకు పట్టుకుందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై పోరు చేసే సమయం ఆసన్నమైందని, ఐక్యంగా ఉండి మోదీ రాక్షస పాలనను అంతమొందిద్దామని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వనరులు అందిపుచ్చుకున్నామని, విద్యుత్ రంగంలో ముందు వరుసలో ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ అంటే ఆంధ్రోళ్లకు గిట్టదని కొందరు అబద్ధపు ప్రచారాలు చేశారని, కానీ వాటిని తలకిందులు చేస్తూ మొదటగా బీఆర్ఎస్లో చేరిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాల మంత్రులు, ఢిల్లీ అధికారులు మెచ్చుకుంటుంటే ప్రధాని మోదీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట టౌన్, జనవరి 8 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఐక్యతను పెంచి అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేసి యావత్ దేశంలోనే ముందున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఏదైతే కలలు గన్న రాష్ర్టాన్ని సాధించుకున్నామో… దానిని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుంటున్నామని, అందులో విద్యుత్ రంగం ముందు వరుసలో ఉందన్నారు. బీఆర్ఎస్ అనుబంధ టీఆర్వీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 2023 డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సమస్యను ముందే గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన వరాలను ఇచ్చే గొప్ప నాయకుడు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా గత ఎనిమిదేండ్లుగా నిరంతరం అభివృద్ధి పాలన కొనసాగిస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం పాత్ర కీలకమైందన్నారు. నిరంతర విద్యుత్, పుష్కలంగా తాగు, సాగునీరు, వినూత్న రీతిలో ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో ప్రజలంతా సుభిక్షంగా జీవిస్తున్నారన్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో 24 గంటల కరెంట్ అందుతుండటంతో ఇక్కడ పరిశ్రలు స్థాపించేందుకు అంతా మొగ్గుచూపుతున్నారన్నారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి మిగిలి ఉన్న సమస్యలను త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఆ సంఘం సభ్యులు మంత్రి జగదీశ్రెడ్డితోపాటు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్, కార్యదర్శి కోడూరి ప్రకాశ్, కరెంట్రావు, యూసుఫ్, పిన్నని మల్లికార్జున్, రమేశ్బాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరికలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్.ఎస్ మండలం బొప్పారం, నశింపేట, రామోజీతండా, కోటపహాడ్, తుమ్మలపెన్పహాడ్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే చెప్పిండో ప్రస్తుతం అది చేసి చూపించాడన్నారు. నాడు కరువుతో వెనుకబడ్డ తెలంగాణాను నేడు అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దేశానికి దిక్సూచిగా చేశాడన్నారు.
బొప్పారం గ్రామం నుంచి బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు జటంగి లింగయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు జజ్జూరి వేణు, కాంగ్రెస్ గ్రామ కార్యదర్శి మేడేపల్లి శంభయ్య, నశింపేట మాజీ సర్పంచ్ ముల్కలపల్లి రామచంద్రు, వార్డు సభ్యులు యాతాకుల మల్లయ్య, బొడ్డు శ్రీను, నశింపేట గ్రామ యూత్ అధ్యక్షుడు తంగెళ్ల రాంరెడ్డి, కోటపహాడ్ నుంచి బీజేపీ మండల ఉపాధ్యక్షుడు వీరమళ్ల మల్సూర్, తుమ్మలపెన్పహాడ్ నుంచి బీజేపీ నాయకులు పులుగుజ్జు గోపాల్, దొంతరబోయిన సైదులు, లింగయ్య, గ్రామ మాజీ అధ్యక్షుడు కటారి నాగయ్య, ఎరుకలి ఎల్లయ్య, బెల్లంకొండ పరమేశ్ కాంగ్రెస్ నుంచి ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ వీరన్న ఆయా గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, అధ్యక్షులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సహకారంతో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నరసింహారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, బీఆర్ఎస్ మండల కార్యదర్శి బత్తుల ప్రసాద్, అధికార ప్రతినిధి లింగాల గుంషావలీ, యూత్ అధ్యక్షుడు తంగెళ్ల మధుసూదన్రెడ్డి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు కసగాని బ్రహ్మంగౌడ్, ఏపూరు సర్పంచ్ సానబోయిన రజితాసుధాకర్, రామన్నగూడెం ఎంపీటీసీ నారగాని ఎల్లమ్మ, కన్నయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.