యాదగిరిగుట్ట, ఆగస్టు 31 : ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పంతో రైతన్న ముఖాల్లో చిరునవ్వు కనిపించనున్నది. కరువు నేలల్లో సిరుల మాగాణం కానున్నది. బీడు భూములు సాగులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ డిజైనింగ్తో పంటపొలాలు పచ్చబడనున్నాయి. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలను అందించేందుకు నిర్మిస్తున్న అశ్వరావుపల్లి కుడి కాల్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 35.275 కిలోమీటర్ల ప్రధాన కుడి కాల్వ ఆధునీకరణ, కొత్త కాల్వ పనులు, కాల్వ కట్ట పటిష్టత, అదనపు కట్ట వెడల్పు నిర్మాణం, లైనింగ్, స్ట్రక్చర్లు, పూడిక తొలగింపు, కెనాల్ క్రాసింగ్ పనులు సాగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.138 కోట్లు మంజూరు చేయగా.. 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 20 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. అశ్వరావుపల్లి ప్రధాక కుడి కాల్వ పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని 15వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో ధర్మసాగర్ జలాశయాన్ని నిర్మించారు. దేశంలోనే అతిపెద్ద జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ధర్మసాగర్లోని చెరువు వద్ద జలాశయం నిర్మాణం చేపట్టారు. కాకతీయులు నిర్మించిన ఈ చెరువును జలాశయంగా మార్చి నీటి నిల్వ సామర్థ్యాన్ని 0.75 టీఎంసీల నుంచి 1.5 టీఎంసీలకు పెంచారు. ఇక్కడి నుంచి మోటర్ల సాయంతో గోదావరి జలాలను తీసుకొచ్చి పైప్లైన్ల ద్వారా అశ్వరావుపల్లి జలాశయంలోకి తరలిస్తారు. అక్కడి నుంచి జలాశయాలు, చిన్న చెరువులు, కుంటలను నింపుతారు.
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ధర్మసాగర్తోపాటు ఎగువ ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయి. దేవాదుల రీ ఇంజినీరింగ్ తర్వాత 415 మీటర్ల మట్టానికి ఎగువన ఉన్న భీం ఘన్పూర్.. అక్కడి నుంచి పాలకుర్తి పంప్హౌస్కు నీటిని తరలించి ధర్మసాగర్ జలాశయాన్ని నింపుతారు. ధర్మసాగర్ ఎగువ ప్రాంతంలోని జలాశయాలకు మోటర్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. ధర్మసాగర్ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.4 టీఎంసీలు కాగా, ఇది నిండిన తర్వాత ఆర్ఎస్ ఘన్పూర్ జలాశయం (.1.57 టీఎంసీ) అశ్వరావుపల్లి (.74 టీఎంసీ), చీటకోడూరు (0.30 టీఎంసీ) జలాశయాలను నింపుతారు. ధర్మసాగర్ పంపుహౌస్ నుంచి మరో పైప్లైన్ ద్వారా గండిరామారం (0.40 టీఎంసీ), బొమ్మకూరు (0.30 టీఎంసీ) జలాశయాలకు నీటిని పంపింగ్ చేస్తారు.
ఆలేరు నియోజకవర్గంలో మొత్తం 590 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 499 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. మరో 91 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఇందులో 85 ఎకరాలకు సంబంధించి నిధులు మంజూరు కాగా.. త్వరలో రైతులకు అందజేయాల్సి ఉన్నది. మరో 6ఎకరాల భూ సేకరణ ప్రక్రియ చేయాల్సి ఉన్నది.
అశ్వరావుపల్లి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రధాన కుడి కాల్వతో ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, గుండాల మండలాల్లోని 15వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు ఆలేరులో ప్రవహించే బిక్కేరు వాగు నీటిని పంప్ చేస్తారు. దీంతో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నీటి చుక్కలేని బిక్కేరు వాగు జలకళ సంతరించుకోనున్నది. దీంతోపాటు ఆలేరు పెద్దవాగు (బిక్కేరు) ప్రవహించే ప్రాంతాలైన ఆలేరు మండలంలోని ఆలేరు, సాయిగూడెం, మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి, అమ్మనబోలు, తేర్యాల, గుండాల మండలంలోని అనంతారం, సుద్దాల, ఆత్మకూరు(ఎం) మండలంలోని పారుపల్లి, మొదుగుబావిగూడెం ప్రాంతాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగనున్నాయి.
ఉమ్మడి వరంగల్తోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆలేరు ప్రాంతానికి సాగు నీటిని అందించాలని 2006-07లో అప్పటి ప్రభుత్వం అశ్వరావుపల్లి కాల్వను నిర్మించాలని తలచింది. కానీ.. కాల్వ తవ్వకాల్లో పురోగతి లేకపోవడంతోపాటు ఇంజినీరింగ్, డిజైన్లు సరైన పద్ధతిలో నిర్మించలేదన్న విమర్శలు స్థానికుల నుంచి వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అశ్వరావుపల్లి జలాశయాన్ని మరింత వేగవంతం చేయాలని అకాంక్షించారు. అందుకనుగుణంగా అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాల్వ నిర్మాణం ప్రస్తుతం పెరిగిన ధరలకనుగుణంగా రూ.138 కోట్లు విడుదల చేశారు. స్టేషన్ ఘన్పూర్, జనగామ, ఆలేరు నియోజకవర్గాల్లో జరుగుతున్న కాల్వ పనులు దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేశారు.
2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలో అశ్వరావుపల్లి కాల్వను అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 20 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ కాల్వతో ఆలేరు, గుండాల మండలాలకు సాగునీటి సమస్య తప్పనుంది. ఎన్నో ఏండ్లుగా బీడు బారిన ఆలేరును గోదావరి జలాలతో కోనసీమగా మారుస్తాం. సాగు జలాలపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో భవిష్యత్తులో ఆలేరుకు నీటి సమస్య ఉండబోదు.
– గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ప్రభుత్వ విప్
అశ్వరావుపల్లి నుంచి ఆలేరుకు 35.275 కిలోమీటర్ల వరకు ప్రధాన కుడి కాల్వ పనులు 80 శాతం పూర్తయ్యాయి. కాల్వ ఆధునీకరణ, పునర్నిర్మాణం పనులు, కాల్వ గట్ల పటిష్టత, అదనపు కట్ట వెడల్పు నిర్మాణం, కాల్వల పూడికతీత పనులు, ఆయా ప్రాంతాల్లో రోడ్లను దాటుతూ స్ట్రక్చర్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మొత్తం 35.275 కిలోమీటర్ల కాల్వ వెడల్పు పనులు పూర్తయ్యాయి. అందుకు అనుగుణంగా డిజైనింగ్ పనులు, కాల్వకు సంబంధించిన మట్టి పనులు పూర్తి చేశారు. మొత్తం కాల్వ నిర్మాణంలో 70 స్ట్రక్చర్లను నిర్మించాల్సి ఉండగా.. అన్నీ పూర్తయ్యాయి. 35.275 కిలోమీటర్ల కాల్వకు గాను 20.275 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి కాగా.. మరో 10 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. జాతీయ రహదారి దాటేందుకు 14 కెనాల్ క్రాసింగ్లను నిర్మించారు.
అశ్వరావుపల్లి కుడి ప్రధాన కాల్వ పొడువు 34 కిలోమీటర్లు ఉండగా.. మరో 1.275 డిస్ట్రిబ్యూటరీ కాల్వ నిర్మాణం చేపట్టారు. రీచ్ 3లో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో 10 కిలోమీటర్లు మాత్రమే ప్రధాన కాల్వ ఉంటుంది. రీచ్ 2లో 1.50 కిలోమీటర్ల కాల్వ పనులుగా విభజించారు. ప్రధాన కాల్వతో మొత్తం 10వేల ఎకరాలు, రీచ్ 3లో భాగంగా నిర్మాణం చేపడుతున్న డిస్ట్రిబ్యూటరీ కాల్వ ద్వారా గుండాల మండలంలోని అనంతారం, వెల్మజాల వరకు మరో 5వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వస్తుంది. రెండు మండలాల్లో మొత్తం 13,154 ఎకరాలు సాగులోకి రానుండగా.. మరో 1,846 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఈ రెండు మండలాలను కలిపి మొత్తం 15వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.
అశ్వరావుపల్లి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, గుండాల మండలాలకు సాగునీటిని అందించే విధంగా ప్రతిపాదించారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లిలో 0.74 టీఎంసీ సామర్థ్యంతో అశ్వరావుపల్లి జలాశయాన్ని నిర్మించారు. అశ్వరావుపల్లి జలాశయంలోని మెయిన్ రెగ్యులేటర్ వద్ద ప్రారంభమైన డిస్ట్రిబ్యూటరీ ప్రధాన కుడి కాల్వ ద్వారా 35.275 కిలోమీటర్లు ప్రవహించి ఆలేరు బిక్కేరు వాగులోకి గోదావరి జలాలను విడుదల చేస్తారు. అశ్వరావుపల్లి జలాశయం నుంచి ఖిలాషాపూర్, ఇబ్రహీంపురం, మాచారం, యశ్వంత్పూర్, జనగామ జిల్లా కేంద్రం నుంచి కళ్లెంకు వస్తుంది. 34 కిలోమీటర్ల వద్ద గల శారాజీపేట నుంచి టంగుటూరు వెళ్లేదారిని తాకుతుంది. మరో 1.27 కిలోమీటర్లు ప్రవహించిన కాల్వ నీటిని సాయిగూడెం నుంచి కొల్లూరులో బిక్కేరు వాగులోకి విడుదల చేస్తారు.