న్యూఢిల్లీ, జూలై 27 : కెనరా బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,856 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.4,752 కోట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.38,063 కోట్ల నుంచి రూ.39,684 కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.31 వేల కోట్ల నుంచి రూ.32,957 కోట్లకు పెరిగింది.
ఏడాది క్రితం 2.69 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ ఈ ఏడాది జూన్ త్రైమాసికానికిగాను 1.57 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ కూడా 0.63 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గాయని పేర్కొంది. ఇదే సమయంలో మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,399 కోట్ల నిధులను వెచ్చించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ, సీఈవో బ్రజేశ్ కుమార్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.10 వేల కోట్లు దాటిందని, గతేడాదితో పోలిస్తే 13 శాతం ఎగబాకిందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల నుంచి ఎఫ్సీఎన్ఆర్ ద్వారా 1.3 బిలియన్ డాలర్ల డిపాజిట్లను సేకరించగా, మరో బిలియన్ డాలర్లను విదేశీ కరెన్సీ రూపంలో రుణాలు తీసుకున్నట్టు చెప్పారు.