యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది వానకాలం సీజన్లో అత్యధికంగా వరి సాగు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 3,05,126 ఎకరాల్లో వరి వేశారు. అత్యధికంగా వలిగొండ మండలంలో 42,367 ఎకరాల్లో సాగు చేశారు. తర్వాతి స్థానాల్లో రామన్నపేట, భూదాన్ పోచంపల్లి ఉన్నాయి. వరి తర్వాత 1.02 లక్షల ఎకరాలతో పత్తి రెండో స్థానంలో ఉంది. సుమారు 3.50 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అక్టోబర్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో 293 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది.
ఇందులో 75 కేంద్రాలు బంద్ అయ్యాయి. 80 ఐకేపీ కేంద్రాలను ప్రారంభించగా 20 కేంద్రాలు మూసేశారు. 207 పీఏసీఎస్ సెంటర్లు ఓపెన్ చేయగా 55 కేంద్రాలు క్లోజ్ చేశారు. 12 రైతు సేవా కేంద్రాలు కొనసాగుతున్నాయి. రామన్నపేట, వలిగొండ, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఇంకా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 2,28,063 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 2,24,603 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలింది. ఇంకా 3,459 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు పంపించాల్సి ఉంది.
జిల్లాలోని రైతులకు రూ.501.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే 358.23 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 143.30 కోట్లు అన్నదాత అకౌంట్లలో డిపాజిట్ చేయాల్సి ఉంది. మిగతావి ప్రాసెస్లో ఉన్నాయని, త్వరలోనే జమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ధాన్యం సేకరించినా కూడా డబ్బులు సకాలంలో అందేవి కావు. నెలలపాటు పెండింగ్లో పెట్టేవారు. దీంతో రైతులు పండించిన పంటకు డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు లేకుండా ఠంఛనుగా డబ్బులు అందించింది. ధాన్యం కొన్న వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకుంది.
జిల్లా అధికారులు పకడ్బందీ వ్యూహం, పక్కా కార్యాచరణతో పనిచేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ధాన్యం సేకరణ ముగిసింది. అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)భాస్కర్ ఎన్నికలు ఉన్నా.. ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సివిల్ సప్లయ్, గ్రామీణాభివృద్ధి, సహకార, వ్యవసాయ శాఖలతోపాటు మరో పది శాఖలు సమన్వయం చేసుకోవడంతో కొనుగోళ్లు వేగంగా, సులభంగా జరిగాయి. పారదర్శకంగా కొనుగోళ్లు జరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. ఇంకా 57 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఇక రైతులు పండించిన ధాన్యానికి తెలంగాణ సర్కారు ఏటా మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తున్నది.
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు రావడం, యాసంగి సీజన్ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ప్రణాళిక రూపొంది స్తున్నారు. 3.50 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత పత్తి, ఇతర పంటలు వేయనున్నారు. అదేవిధంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు నకిలీ విత్తనాలు అమ్మకుండా పటిష్ట నిఘా పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.