నల్లగొండ రూరల్, ఏప్రిల్ 11: యాసంగి 2022-23 లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణం పరిధిలోని ఆర్జాలబావి, చందనపల్లి, చిన్నసూరారంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం రాకను బట్టి రెండు, మూడు రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను సంప్రదించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యాసంగిలో జిల్లాలో 5,56,802 ఎకరాల్లో వరి సాగు చేయగా 13,72,970 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామన్నారు. ఇందులో రైస్ మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు, స్థానిక అవసరాలు పోగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం రాకను బట్టి కేంద్రాలను పెంచనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎకడా లేని విధంగా రెండో పంటగా యాసంగి సీజన్లో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రా ల ద్వారా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. 2014-15లో వానకాలం, యాసంగి సీజన్లలో 4 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి రైతులకు 286.53 కోట్ల చెల్లించగా.. 2020-21లో వానకాలం, యాసంగి సీజన్లు కలిపి 10.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 2,061.68 కోట్ల చెల్లించినట్లు వెల్లడించారు. ధాన్యం ఉత్పత్తి 2014-15 నుంచి 2020-21 నాటికి 10 రెట్లు పెరిగిందన్నారు. అందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, సాగు నీరే కారణమన్నారు. ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసి ప్రతి సీజన్లో మిల్లర్లు ఎఫ్సీఐకి వందశాతం డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు.
278 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో ప్రస్తుత యాసంగిలో ఐకేపీ ద్వారా 138, పీఏసీఎస్ ద్వారా 140 మొత్తం 278 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, గన్నీబ్యాగ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు ఐకేపీలకు ఏపీఎంలను, పీఏసీఎస్ కేంద్రాలకు సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్లను ఇన్చార్జీలుగా నియమించినట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు పరీక్షించేందుకు ఏఈఓలను నియమించినట్లు చెప్పారు.
అన్ని రైస్ మిల్లుల భాగస్వామ్యం
కొనుగోలు ప్రక్రియలో అన్ని రైస్ మిల్లులను కూడా భాగస్వామ్యం చేసినట్లు, జిల్లాలో గతంలో పాల్గొనని 14 మిల్లులు కూడా కొనుగోళ్లలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నట్లు, జిల్లాలో 123 మిల్లులు కొనుగోలు ప్రక్రియలో పాల్గొనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు పాల్గొనే శాఖల అధికారులు,సిబ్బంది నిమగ్నమవుతారని అన్నారు. ప్రతి రోజూ అదనపు కలెక్టర్లు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తూ కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ తాలు లేకుండా నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం పాటించాలని, కోనుగోలు చేసిన మూడు రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు లు ధాన్యంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఎకౌంట్ పాస్పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్ కాపీలు తీసుకొని రావాలన్నారు. ప్రతి పది మిల్లులకు ఒక అధికారిని నియమించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వెంటనే అదే రోజు ధాన్యం విక్రయించిన రైతుల ఓపీఎంఎస్లో వివరాలు నమోదు చేయాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో రైతులకు ఎలాంటి వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో పాటు, తాగు నీరు, చలువ పందిళ్లు వేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ కాళిందిని, డీసీఓ రాజేందర్రెడ్డి, డీఎం నాగేశ్వర్రావు, ఆర్డీఓ జయంచంద్రారెడ్డి, డీపీఎం రామలింగయ్య, ఏపీఎం కస్పరాజు సైదులు, అన్నదాత సొసైటీ సభ్యులు గాదె రాంరెడ్డి, పెద్ది వెంకటయ్య, గాదె రాజశేఖర్రెడ్డి ,సురిగి మణేమ్మ, పెద్ది ఇందిరమ్మ, సీసీ నరసింహా, వీడీఏ కల్యాణి, నారగోని పల్లవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి , బడుపుల శంకర్ పాల్గొన్నారు.
ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
నడిగూడెం: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎంపీపీ యాతాకుల జ్యోతీ మధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు అన్నారు. నడిగూడెం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా న్ని వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో తాసీల్దార్ నాగేశ్వరరావు, ఏఓ రాజగోపాల్, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మీమల్లేశ్యాదవ్, ఉప సర్పంచ్ నసీమా, పీఏసీఎస్ చైర్మన్ పుట్టా రమేశ్, డైరెక్టర్లు పాల్గొన్నారు