వృత్తిదారుల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, రజకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. గతంలో బొగ్గు కొనుగోలు చేసి ఇస్త్రీ చేసే రజకులకు, హెయిర్ సెలూన్ దుకాణాలు నడిపే నాయీ బ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్ ఇవ్వడంతో ఎంతో ఉపశమనం కలిగింది. ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల రూపాయల వరకు కరెంట్తో ఆదా అవుతున్నది. సూర్యాపేట జిల్లాలో 4,600 మందికి ప్రతి నెలా సుమారు రూ.92 లక్షలు మిగులుబాటు అవుతుంది. సమైక్య పాలనలో తమను ఎవరూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తమకు అండగా నిలిచి ఆదుకుంటున్నారని రజకులు, నాయీబ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సూర్యాపేట, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో రజకులతోపాటు నాయీబ్రాహ్మణుల జీవితాలు అంధకారంలో మగ్గేవి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వారి కష్టాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. జిల్లాలో ఇస్త్రీ చేసే రజక కార్మికులతోపాటు నాయీబ్రాహ్మణులకు నెలనెలా 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తుండడంతో వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. గతంలో ఇస్త్రీ చేసే వారికి బొగ్గు, కిరోసిన్ కోసం ప్రతి నెలా దాదాపు రూ.1200 నుంచి 1800 వరకు ఖర్చయ్యేది. నేడు తెలంగాణ సర్కారు వారికి ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో ఆ ఖర్చు మిగిలి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. నాయీబ్రాహ్మణులు కూడా తమ హెయిర్ సెలూన్లలో దాదాపు రూ.2 వేల విలువ చేసే విద్యుత్ను ఉచితంగా అందుకుంటున్నారు. జిల్లాలో రజకులు, నాయీబ్రాహ్మణ వృత్తిదారులు దాదాపు 4,600 మంది ఉండగా వారందరికీ కలిపి ప్రతి నెలా దాదాపు రూ.92 లక్షలు మిగులుబాటు అవుతున్నాయి.
ప్రజల మనసులో ఏముంది, వారు ఏమి కోరుకుంటారో తెలిసిన నాయకుడిగా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నీ చేస్తుండడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తాగు, సాగునీటితోపాటు 24 గంటల విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడడంతోపాటు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. మరో పక్క ఎవరూ ఊహించని రీతిన పెరిగిన పింఛన్లు, రైతుబంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలవుతుండడంతో ప్రజల మోములో ఆనందం ఉట్టిపడుతుంది. ఉమ్మడి పాలనలోని ప్రభుత్వాలు రజకులు, నాయీబ్రాహ్మణులను ఏమాత్రం పట్టించుకోకపోగా, నేడు స్వరాష్ట్రంలో నెల నెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తుండడంతో తమ వృత్తిని కొనసాగిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు.
మాది నిరుపేద కుటుంబం. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మా అమ్మ ఇంటింటికీ వెళ్లి బట్టలు ఉతికి కుటుంబాన్ని పోసించింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలో మా అమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబం భారంగా మారింది. తప్పని పరిస్థితిలో ఇస్త్రీ చేయడం మొదలుపెట్టా. బొగ్గుల పెట్టెతో ఇస్త్రీ చేసేవాడిని. బొగ్గు కోసం నెలకు రూ.1,500 నుంచి 2,000 వరకు ఖర్చయ్యేది. మా బాధలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ మాకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తుండడంతో బొగ్గు బాధ తప్పింది. ఖర్చు కూడా తగ్గింది. రజకులకు ఉచిత కరెంటు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– చింతల సైదులు, అనంతారం, పెన్పహాడ్
జిల్లాలో ఇస్త్రీ చేసే రజకులు, నాయీబ్రాహ్మణ కుటుంబాలు కలిపి 4,600 పైగానే ఉండగా వారందరికీ నెల నెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందదిస్తున్నది. 2014కు ముందు ఇస్త్రీ చేసే రజకుల పరిస్థితిని ఎలా ఉండేదంటే వీధుల్లో చిన్నచిన్న గుడిసెలు వేసుకొని నానా తంటాలు పడుతూ బట్టలు ఇస్త్రీ చేసేవారు. బొగ్గు, కిరోసిన్కు దాదాపు నెలకు రూ.1,500 వరకు ఖర్చు అయ్యేది. ఆ ఖర్చులు పోను నెలకు రూ.2 నుంచి 3 వేల వరకు సంపాదించేవారు. నేడు వారికి నెలనెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో బొగ్గు తిప్పలు తప్పాయి. కిరోసిన్ ఖర్చు లేదు.
దాంతో నాడు అయ్యే ఖర్చు రూ.1,500లతోపాటు వారికి వచ్చే ఆదాయం రూ.3 వేలు కలిపి రూ.4,500 వరకు మిగులుతున్నాయి. ఇక హెయిర్ సెలూన్లకు కూడా నెల నెలా 250 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తుండడంతో వారికి కూడా ప్రతి నెలా రూ.2 వేల విద్యుత్ చార్జీలు మిగులుబాటు అవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య పాలనలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి చేయూతకు నోచని రజకులు, నాయీబ్రాహ్మణులు నేడు ఉచిత విద్యుత్ ద్వారా జిల్లాలోని సుమారు 4,600 కుటుంబాలు నెలకు రూ.92 లక్షల చొప్పున లబ్ధి పొందుతున్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెబుతున్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలూ కులవృత్తుల వారిని పట్టించుకోలేదు. కనీసం మాకు గుర్తింపు కూడా ఉండేది కాదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని కులవృత్తుల వారికి అండగా ఉంటున్నారు. సెలూన్ షాపు కరెంటు కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో మాపై ఆర్థిక భారం తగ్గింది. గతంలో గిరాకీ ఉన్నా, లేకపోయినా కరెంటు బిల్లు, ఇతర ఖర్చులు తప్పేవి కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక కరెంటు బిల్లు కట్టాల్సిన పనిలేకుండా పోయింది. కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న మాకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వ సహకారంతో షాపును సంతోషంగా నడుపుకుంటున్నా. మాకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
-శ్రీరాముల జానయ్య, హెయిర్ సెలూన్ నిర్వాహకుడు, చివ్వెంల
ఉమ్మడి పాలనలో ఏమాత్రం ఆదరణకు నోచుకోని మమల్ని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారే మమ్మల్ని చేరదీశారు. రజక వృత్తిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్తోపాటు సబ్సిడీ రుణాలు అందించి మా కుటుంబాలకు అండగా నిలిచారు. గత ప్రభుత్వాల హయాంలో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు. వృత్తిని మానేసి కూలికి వెళ్లాల్సి వచ్చేది. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ కొరత లేదు. ప్రభుత్వం ఉచిత కరెంట్ అందిస్తుండడం ఎంతో మేలవుతుంది. నెల మొత్తం ఇస్త్రీ చేసినా 200 యూనిట్లకు మించి కరెంటు కాలట్లేదు. దాంతో కరెంట్ బిల్లుల సమస్యే ఉండట్లేదు. ఉచిత కరెంటు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-తాతరాజు దుర్గాప్రసాద్, రజకుడు, మఠంపల్లి
రాష్ట్రంలోని పేద రజకుల ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సెలూన్ షాపుకు 250 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వడం హర్షణీయం. గతంలో మేము ప్రతిరోజూ బొగ్గులు కొని వాటితో బట్టలు ఇస్త్రీ చేసేవాళ్లం. దాంతో బొగ్గు వాసన, పొగతో ఇబ్బంది పడేవాళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఇ్రస్త్రీ పెట్టతోపాటు ప్రతి నెలా 250 యూనిట్ల చొప్పున కరెంటు ఫ్రీగా ఇస్తుండడంతో రోజుకు రూ.600 నుంచి 700 సంపాదిస్తున్నాం. మమ్మల్ని గుర్తించి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉంటాం.
-నారాయణదాసు శ్రీను, రజకుడు, తుంగతుర్త