యాదగిరిగుట్ట, జనవరి17 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. లక్ష్మీనారసింహులు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణతంతు జరిపారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి తిరువారాధన చేపట్టి స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. పాత గుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. శివాలయం చెంతన గల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.44,90,444 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఢిల్లీ, కేరళ సీఎంలు స్వామివారిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వస్తున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉభయ దర్శనాలు, ఆర్జిత పూజలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత వెల్లడించారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
స్వామివారిని హిమాచల్ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్కుమార్ ఖచి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.