కరోనా నుంచి కోలుకున్న చాలా మందిలో కనిపించే లక్షణాలు.. ఆయాసం, ఛాతిలో నొప్పి, ఆలసట. వీటికి తోడు కరోనా నుంచి బయట పడ్డామన్న సంతోషం తీరకముందే గుండెకు ముప్పు ముంచుకొస్తున్నది. కరోనా నుంచి బయటపడి గుండెపోటుకు బలైపోతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ నుంచి కోలుకున్నవారిలో అసలు గుండెపోటు ఎందుకొస్తుంది? ఆయాసం, ఛాతిలో నొప్పికి గల కారణం ఏమిటి? వీటి ద్వారా ఇంకా ఏమైనా ముప్పు ఉందా? వంటి సందేహాలకు ప్రముఖ కార్డియాలజిస్ట్, ప్రైమ్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ రఘు చెరుకుపల్లి ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు.
కరోనా నుంచి కోలుకున్నవారిలో గుండెపోటుకు కారణం?
సాధారణంగా గుండెపై కలిగే ఒత్తిడే గుండెపోటుకు దారితీస్తున్నది. కరోనా సమయంలో ఇది మరింత ఎక్కువైంది. శరీరంపై ఒత్తిడి పెంచడమే వైరస్ ప్రధాన లక్షణం. ఈ ఒత్తిడి కారణంగా కణాల్లో రక్తం గడ్డకడుతుంది. అంటే ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువవుతుందో అప్పుడు శరీరంలో క్లాటింగ్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. అది గుండెపోటుకు దారి తీస్తుంది.
దాన్నుంచి కాపాడుకొనే పరిష్కారం ఏంటి?
షుగర్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ క్యాటగిరీలకు చెందినవారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కచ్చితంగా ‘హై సెన్సిటివ్ ట్రోపోనెంట్ టెస్ట్’ చేయించుకోవాలి. దీని ద్వారా గుండెపై ఒత్తిడిని తెలుసుకొనే వీలుంటుంది. ఒకవేళ గుండెపై ఒత్తిడి పెరిగితే ట్రోపోనెంట్ లెవల్స్ పెరుగుతాయి. ఇదే జరిగితే భవిష్యత్లో వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించి ముందుగానే మందులు వాడితే ప్రమాదం నుంచి బయట పడొచ్చు. సివియర్ కొవిడ్ అంటే కేవలం ఊపిరితిత్తులపైనే కాదు గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. దీనికి ముందు జాగ్రత్తనే మందు.
ఆయాసం, ఛాతిలో నొప్పి ఎందుకు?
కోలుకున్నవారిలో చాలా మంది ఆయాసం, ఛాతిలో నొప్పి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొద్ది దూరం నడవగానే లేదా మెట్లు ఎక్కగానే, చిన్న పని చేయగానే ఆయాసపడిపోతున్నారు. ఛాతిలో మంట, నొప్పితో బాధపడుతున్నారు. ఇది కూడా వారి శరీరంపై కరోనా వల్ల కలిగిన ఒత్తిడే కారణం. ఇలాంటి లక్షణాలున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి సీటీ స్కాన్ చేస్తే అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ లోపల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయాసం, ఛాతిలో నొప్పి వస్తున్నవారిలో చాలా మందికి హై బీపీ ప్రమాదం పొంచి ఉన్నది. నా వద్దకు వచ్చే చాలా మందిలో ఈ లక్షణం కనిపిస్తున్నది.
స్టంట్స్ వేసుకున్నవారు, ఇతర గుండె సంబంధిత వ్యాధులున్నవారు టీకా వేసుకోవచ్చా?
ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని కాపాడేది వ్యాక్సిన్ మాత్రమే. ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. స్టంట్స్ వేసుకున్నవారు, ఇతర గుండె సంబంధిత వ్యాధులున్నవారు నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. బీపీ, షుగర్ వంటి వ్యాధులున్నవారు కూడా నిర్భయంగా టీకా వేసుకోవచ్చు. గుండె జబ్బు, ఇతర వ్యాధులున్నవారు ముందు జాగ్రత్తగా కరోనా టీకాతోపాటు న్యుమోనియా, ఇన్ఫ్లుయెంజాకు వ్యాక్సిన్ తీసుకోవాలి. దీని వల్ల గుండెకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఈ రెండు వ్యాక్సిన్లు అందరికీ అవసరం లేదు.
కోలుకున్నవారిలో మేజర్గా వచ్చే ఇబ్బంది ఏమిటి?
కరోనా నుంచి కోలుకున్నవారిలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి సెట్ కావడానికి 3- 6 నెలల సమయం పడుతుంది. కొవిడ్ వచ్చిన వాళ్లలో దాదాపు అందరిలో బీపీ ఉంటుంది. ఇది మేజర్ ప్రాబ్లమ్. 30- 50 ఏండ్ల వయస్సు గల వారిలో ఇది ఎక్కువగా ఉన్నది. అంటే సివియర్ లక్షణాలతో కరోనా నుంచి కోలుకున్నవారిలో కొత్తగా బీపీ వస్తున్నది.
కోలుకున్నవారికి ఎలాంటి కొత్త సమస్యలు వస్తున్నాయి?
నేను గమనిస్తున్నవారిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రధానంగా మూడు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా దాంతోపాటు రోగాల ప్యాకేజీని తీసుకొస్తుంది.