గొర్రెలు, గేదెలు, కోళ్ల పెంపకానికి షెడ్ల మంజూరు
ప్రతి పంచాయతీ పరిధిలో మొదట ఐదుగురు లబ్ధిదారులకు కేటాయింపు
బాన్సువాడ , ఏప్రిల్ 4 : రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహం అందించి ఆర్థికంగా ఎదిగే విధంగా ఐకేపీ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖల ద్వారా బర్రెలు, గొర్రెలు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం కోసం పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నది. ప్రస్తుతం పాడిని ప్రోత్సహించే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నది. గతంలో ఆయా శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఐకేపీ, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన పాడి రైతులకు ప్రోత్సాహం అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఆయా సామాజిక వర్గాల లబ్ధిదారులకు ప్రథమంగా ఉపాధి హామీ పథకంలో షెడ్లు నిర్మించుకునేందుకు మొదటి ప్రాధాన్యతగా నిధులు మంజూరు చేస్తున్నది. కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద గేదెల షెడ్లు నిర్మించుకునేందుకు 628 యూనిట్లను మంజూరు చేయగా ఇప్పటికే 114 షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకం కోసం 182 షెడ్లను మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో 13 మంది లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలో కోళ్ల పెంపకం కోసం 34 మంజూరు చేయగా, ఇప్పటికే 5 యూనిట్లు పురోగతిలో ఉన్నాయని ఈజీఎస్ అధికారులు చెబుతున్నారు.
యూనిట్ లబ్ధి ఇలా ..
గ్రామాల్లో వ్యవసాయ, ఐకేపీ, పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరిన వారికి వాటి నిర్వహణ కోసం ఉపాధి హామీ పథకంలో గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకం కోసం నిధులు మంజూరు చేస్తున్నది. 6 నుంచి 10 గేదెలు ఉన్న లబ్ధిదారుడికి గెదేల షెడ్డు నిర్మాణానికి రూ.50,370 మంజూరు చేస్తున్నది. గొర్రెలు ,మేకల షెడ్డు కోసం రూ. 39,732 మంజూరు చేస్తున్నది. పెరటి కోళ్ల పెంపకం కోసం ఒక్కో యూనిట్కు రూ.37వేలు కేటాయిస్తున్నది. ఇప్పటికే గేదెల షెడ్ల నిర్మాణ పనులు మాచారెడ్డి, గాంధారి, బిచ్కుంద మండలాల్లో జోరుగా సాగుతున్నాయి.
మంచి అవకాశం..
ఉపాధి హామీ పథకంలో గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, చేపల చెరువుల తవ్వకాలు చేపట్టే వారికి ప్రభుత్వం షెడ్ల నిర్మాణం కోసం యూనిట్ కాస్టుగా నిధులు మంజూరు చేస్తూ పాడి రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-సుదర్శన్, ఏపీవో, బాన్సువాడ