దేవరకొండ, జూలై 31 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలం చిత్రియాల గ్రామానికి చెందిన 20 కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో 2014కు ముందు ఆకలిచావులు ఉండేవని, నేడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల ఆకలిచావులు కొససాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం పొందాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితుల కుటుంబాలకు రూ.2లక్షల బీమా అందుతుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో గండికోట జంగయ్య, ఏటూరు విష్ణు, ముద్దం యాదయ్య, మహేశ్, చాట్ల బలరాం, రమేశ్, ప్రసాద్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బోయపల్లి శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, రామలింగం, వెంకటయ్య పాల్గొన్నారు.