రామగిరి, జూన్ 9 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్ను కూడా ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రభుత్వ ఉన్న పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు 2,37,345 మంది విద్యార్థులకు బుక్స్ అందజేయనున్నారు. కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తక విభాగం (బుక్డిపో)కు నోట్బుక్స్ చేరడంతో వాటిని భద్రపర్చారు. ఇక్కడి నుంచి జిల్లాలోని అన్ని మండలాల ఎంఆర్సీలకు డీఈఓ ఆదేశాలతో పాఠశాలల పునఃప్రారంభం నాటికి చేరవేయనున్నారు.
నోట్బుక్స్ను పరిశీలించిన డీఈఓ
నల్లగొండలో జిల్లా కేంద్ర ప్రభుత్వ పాఠ్యపుస్తక విభాగం(బుక్డిపో)కు వచ్చిన నోట్బుక్స్ను డీఈఓ భిక్షపతి శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అందజేసే రూల్, వైట్ నోట్స్బుక్తోపాటు వివిధ అంశాలను ఆయన బుక్డిపో మేనేజర్ వెంకటాచారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా మండలాల ఎంఆర్సీలకు బుక్స్ను చేరవేసి ఎంఈఓల పర్యవేక్షణలో పాఠశాలలకు పంపిణీ చేస్తామన్నారు. బడి పునఃప్రారంభంకాగానే పాఠ్యపుస్తకాలతోపాటు నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్ విద్యార్థులకు అందజేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి రామచంద్రయ్య, గెజిటెడ్ హెచ్ఎం అంజయ్య ఉన్నారు.
ఉమ్మడి జిల్లాకు నోట్స్ బుక్స్ ఇలా…
6నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు 200 పేజీల సింగిల్ రూల్, వైట్ నోట్బుక్స్ను ఉచితంగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ‘మన ఊరు-మనబడి’ ‘మన బస్తీ-మన బడి’లో భాగంగా అందజేస్తుంది. అయితే 6, 7 తగరగతి ఒక్కొ విద్యార్ధికి 6నోట్బుక్స్, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు 14 నోట్బుక్స్ చొప్పున, ఇంటర్మీడియేట్ చదివే విద్యార్థులకు 12 నోట్ బుక్స్ చొప్పున అందజేస్తారు.