నల్లగొండ, నవంబర్ 19 : రెండు దశాబ్దాల పాటు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండి నగుబాటుకు గురైన నల్లగొండ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కృషితో నీలగిరి అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్నది. ఐదేండ్లలో సుమారు రూ.15వందల కోట్లతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రధానంగా నీలగిరి పట్టణం రూ.1400 కోట్లతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్నది.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడం, మంత్రి కేటీఆర్ నిత్యం పర్యవేక్షించడంతో పట్టణాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. సాధారణ అభివృద్ధి, సంక్షేమ పథకాల నిధులే కాకుడా ప్రత్యేకంగా పట్టణ అభివృద్ధ్దికే రూ.1400 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం.. 93 గ్రామ పంచాయతీల్లో రూ.101 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. నల్లగొండకు ఆధునిక విద్యా దేవాలయమైన ఎన్జీ కళాశాల ఆధునీకరణకు రూ.36 కోట్లు ఇవ్వగా.. వైద్య రంగాన్ని మరింత చేరువ చేసేందుకు మెడికల్ కళాశాల, ఐటీ హబ్తో నీలగిరికి కొత్త అందాలు, సాఫ్ట్వేర్ సొగసును అద్దింది.
ఉద్యమాలకు చైతన్యమైన నల్లగొండ అభివృద్ధ్దిలో మాత్రం ఆది నుంచీ వెనుకబడిందనే చెప్పవచ్చు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల పట్టింపు లేమి కారణంగా వెనుకబాటకు గురైన నీలగిరి పట్టణం నాలుగేండ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ప్రధానంగా సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా పట్టణ అభివృద్ధికి రూ.1400 కోట్లు కేటాయించారు. వీటిల్లో ఇప్పటికే రూ.800 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, మరో రూ.600 కోట్ల పనులు ప్రగతిలో ఉన్నాయి.
పట్టణ వ్యాప్తంగా అన్ని రోడ్ల ఆధునీకరణతోపాటు మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ నిర్మాణం, కళాభారతి, ఆర్ అండ్ బీ అతిథి గృహం, ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, స్వాగత తోరణాలు, వల్లభరావు చెరువు, ఉదయ సముద్రం ఆధునీకరణ, సమీకృత మార్కెట్లు, రైతు బజార్ల ఏర్పాటు, పార్కులు, స్టేడియాల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కళాభారతి నిర్మాణం కోసం ఈ నిధులు కేటాయించింది.
నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి మండలాల్లో మొత్తం 93 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. స్వరాష్ట్రంలో ఈ పల్లెలన్నీ పల్లె ప్రగతితోపాటు ఎస్డీఎఫ్, ఇతర ప్రత్యేక నిధులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. పల్లె ప్రగతితో అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.7.3 కోట్లు వెచ్చించి ట్రాక్టర్లు కొనుగోలు చేయడంతో ప్రతి ఇంటి నుంచి రెగ్యులర్గా చెత్త సేకరణ జరుగుతున్నది. సేకరించిన చెత్తను వేయడానికి, ఎరువుగా మార్చడానికి రూ.2.80 కోట్లతో డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. వైకుంఠ ధామాల కోసం రూ.7కోట్లు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. రైతులు ఒక చోటకు చేరి సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవడానికి రూ.22లక్షల చొప్పున వెచ్చించి నియోజకవర్గంలో 16 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారు.
వీటి కోసం మొత్తం రూ.3.52 కోట్లు ఖర్చు చేశారు. హరితహారం కింద ప్రతి గ్రామంలో వన నర్సరీ ఏర్పాటు చేసి ఏటా మొక్కలు నాటించి పంచాయతీల పర్యవేక్షణలో సంరక్షణ చేపడుతున్నారు. ఎస్డీఎఫ్ నిధులతో రెండేండ్ల కింద రూ.33 కోట్లతో సీసీ రోడ్లు వేయగా, మలి దశలో మరో రూ.19.8 కోట్లతో ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్నది. ఉపాధి హామీ కింద మరో రూ.30 కోట్లతో సీసీ రోడ్లు వేశారు. దీంతో గ్రామాల్లో వీధులన్నీ సీసీమయం అయ్యాయి. నియోజకవర్గంలో 79,309 ఇండ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చి రోజూ ఉదయం, సాయంత్రం మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నారు. తిప్పర్తి మండలం మామిడాలలో రూ.4 కోట్లతో బ్రిడ్జి, ఆయా గ్రామాల్లో 7,335 కిలోమీటర్ల మేర పంచాతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.
నియోజకవర్గ అభివృద్ధితోపాటు సంక్షేమం సైతం విడువని ప్రభుత్వం.. అనేక మందికి పలు రకాలుగా సాయం చేసింది. నియోజకవర్గంలో 34,258 మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.7.41 కోట్లు ఖర్చు చేస్తున్నది. దళిత బంధు ద్వారా తొలి దశలో వంద మంది దళితులకు రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.10 కోట్లు ఆర్థిక సాయం అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ నాలుగేండ్లలో 5,899 మందికి రూ.27.61 కోట్లు ఆర్థిక సాయం చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 7,781 మంది ఆడబిడ్డలకు లక్షా 16 రూపాయల చొప్పున మొత్తం రూ.77,90,02,596 కట్నం కింద ఇచ్చింది.
రైతు బంధు ద్వారా నియోజకవర్గంలో 2018 వానకాలం సీజన్ నుంచి ఇప్పటి వరకు 60వేల మంది రైతులకు 772,65,35,250 రూపాయలు ఖాతాల్లో జమ చేసింది. ఏ కారణం చేతనైనా మరణించిన రైతుకు ఐదు లక్షల ప్రమాద బీమా ఇస్తున్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు నల్లగొండ నియోజకవర్గంలో 544 మంది రైతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.27.20 కోట్లు అందజేసింది. మిషన్ కాకతీయ కింద 380 చెరువులను పునరుద్ధ్దరించి వాటి పరిధిలో 22,450 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నది. అదేవిధంగా ఏటా రెండు పంటలకు ఎనిమిదేండ్లుగా ఎస్ఎల్బీసీ, ఎడమ కాల్వకు సాగు నీరు అందించడం ద్వారా నియోజకవర్గంలో 1.62 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతున్నది.
నల్లగొండ నియోజకవర్గం రెండు దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గరైంది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గం అభివృద్ధికి సుమారు రూ.15 వందల కోట్లు వెచ్చించాను. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పట్టణ అభివృద్ధికే రూ.1400 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా. మరో రెండేండ్లల్లో పట్టణం పూర్తి స్థాయిలో అందంగా ముస్తాబవుతున్నది. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్తో పట్టణమంతా రాత్రి పూట జిగేల్మనేలా ప్లాన్ చేశాం. నల్లగొండ, కనగల్, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లోని 93 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని ఆవాస గ్రామాల అభివృద్ధి చేస్తున్నా. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నాడు ఐటీ మంత్రిగా ఉండి నల్లగొండకు ఐటీ హబ్ తీసుకురాలేదు. నేను ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో ఐటీ హబ్, మెడికల్ కళాశాల తీసుకొచ్చా. 20 ఏండ్లల్లో జరుగని అభివృద్ధి.. ఈ నాలుగేండ్లల్లోనే చేసి చూపించా. నల్లగొండలో ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి సుందరీకరిస్తా.
– కంచర్ల భూపాల్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే
పేదలకు సర్కారు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జనరల్ ఆస్పత్రిని 250 పడకల నుంచి 550 పడకల దవాఖానగా ఆధునీకరించడంతోపాటు ఆస్పత్రిలో అధునాతన పరికరాలు, వైద్యుల కేటాయింపుతో పేదలకు వైద్యం చేరువైంది. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల 101 మంది పేషెంట్లు ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. పది పడకలతో పాలియేటివ్ కేర్ క్యాన్సర్ యూనిట్, పిల్లల కోసం 12 పడకలతో ఐసీయూ, రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 550 పడకలకు ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేశారు. రక్త పరీక్ష నుంచి సిటి స్కాన్ వరకు ఇక్కడే చేస్తున్నారు. మెడికల్ కళాశాల సైతం మంజూరు చేసిన ప్రభుత్వం.. ఆ భవనం కోసం రూ.251 కోట్లు కేటాయించింది. ఎస్ఎల్బీసీలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కళాశాలలో నాలుగు బ్యాచ్లు నడుస్తుండగా.. బ్యాచ్కు 150 మంది చొప్పున 600 మంది వైద్య విద్యార్థులు పలు కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
ప్రభుత్వం ప్రతి ఏటా అభివృద్ధి, సంక్షేమంతోపాటు విద్య, వైద్య రంగాలకు ప్రధాన్యం ఇస్తున్నది. అందులో భాగంగానే నల్లగొండ నియోజకవర్గంలో విద్యా నిలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నియోజకవర్గ వ్యాప్తంగా తొలి దశలో రూ.11.92 కోట్లు వెచ్చించి 67 పాఠశాలల్లో 13 రకాల పనులు చేపట్టి అందంగా నిర్మాణం చేపడుతున్నారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టారు. మరమ్మతులు, మౌలిక వసతులు కల్పించి సుందరంగా తీర్చిదిద్దింది. ఉన్నత విద్యకు నాంది అయి శిథిలావస్థకు చేరిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాలను రూ.36 కోట్లతో ఆధునీకరించాలని నిర్ణయించింది. తొలి దశలో రూ.12 కోట్లు కేటాయించగా.. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.