యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. ఆయా పాఠశాలలు ఇప్పటి వరకు పదో తరగతి వరకు నడుస్తున్నాయి. అందులో చదువుతున్న విద్యార్థులు టెన్త్ క్లాస్ పూర్తి కానుండటంతో వీటిని జూనియర్ కళాశాలలుగా ప్రభుత్వం మారుస్తున్నది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, నల్లగొండలో 6, సూర్యాపేటలో 4 గురుకుల పాఠాశాలలు జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో కొత్తగా 1500మంది విద్యార్థులకు అవకాశం కలుగనుంది. ఇంటర్లో ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 16వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కళాశాలలో సీటు లభిస్తుంది. కళాశాలల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలల్లోనే జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే అవకాశముంది. అడ్జస్ట్ కాకపోతే కొత్త భవనాలను అద్దెకు తీసుకోనున్నట్లు తెలిసింది.
గురుకులాల్లో సకల సదుపాయాలు
దేశంలో గురుకులాలు అంటేనే తెలంగాణ గుర్తుకొచ్చేలా ప్రభుత్వం సొసైటీలను తీర్చిదిద్దింది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి గురుకులాల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నది. ఏటా ఒక్కో విద్యార్థిపై లక్షకు పైగా ఖర్చు చేస్తున్నది. విశాలమైన భవనాల్లో వసతి ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నది. యూనిఫాం, బ్లాంకెట్లు, బకెట్లు, ట్రాక్ షూస్, బుక్స్, కాస్మోటిక్ ఛార్జీలు, ఇస్తున్నది. డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నది. ఇన్ని సదుపాయాలు ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చదివించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వందల సీట్లకు లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.