తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు నిండి 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, తొమ్మిదేండ్లలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు అమలు చేస్తూ అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో మంత్రి జగదీశ్రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కొండంత అభివృద్ధి జరిగితే, చెప్పింది గోరంత మాత్రమేనని.. 2014కు ముందు తర్వాత మారిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని అన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు నాటి – నేటి ఫొటోలను ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా తెలిపే ప్రయత్నం చేయాలని సూచించారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధితోపాటు వ్యవసాయం, ఇరిగేషన్, శాంతిభద్రతలు, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం ముందున్నదని.. పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. రోజువారీగా నిర్వహించే ఆవిర్భావ వేడుకలను ప్రతి శాఖ ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించారు.
యాదాద్రి భువనగిరి, మే 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రగతిని చాటేలా ఘనంగా నిర్వహించాలని, సంబురాలు అంబరాన్నంటేలా జరుపాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్ల ప్రగతి ఇంటింటికీ చేరాలని, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అందరినీ భాగస్వాములను చేస్తూ సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సిద్ధించిందని, తొమ్మిదేండ్లలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు అమలు చేస్తూ.. అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించి అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్లలో సాధించిన విజయాలు, ప్రగతిని ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులతో మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో మంత్రి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కొండంత అభివృద్ధి జరిగితే.. గోరంత మాత్రమే చెప్పినట్లు తెలిపారు. ఇరిగేషన్లో అద్భుతమైన ప్రగతి సాధించామని, మిషన్ కాకతీయపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.
అన్ని రంగాల్లో ప్రగతి
కాకతీయుల కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యవసాయ రంగంలో వెలుగొందిందని, సమైక్య రాష్ట్రంలో 70ఏండ్లుగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్లగొండ అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తే.. నాలుగేండ్లలో 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని తెలిపారు. తొమ్మిదేండ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిందని.. ఉపాధితోపాటు ఉద్యోగం, వ్యవసాయం, వైద్యం, శాంతిభద్రతలు, పారిశ్రామిక అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్నదని చెప్పారు. 2014కు ముందు.. తర్వాత తెలంగాణను కళ్లకు కట్టినట్లుగా ప్రజలందరికీ తెలియజేసే బాధ్య త ప్రజాప్రనిధులతోపాటు అధికారులందరిపైనా ఉన్నదన్నారు.
వేడుకలను చాలెంజ్గా తీసుకోవాలి
ఉత్సవాల్లో భాగంగా రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలపై మంత్రి పలు సూచనలు చేశారు. ఉత్సవాలను అధికారులు తమదిగా తీసుకొని నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమ్మతితో అందరినీ భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేట్టాలన్నారు. అన్ని శాఖలు తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని నివేదిక రూపంలో తయారు చేసి రెండులోపు ప్రజాప్రతినిధులకు రైతు దినోత్సవం మొదలు 22 వరకు అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులను సత్కరించాలని, గిరిజనోత్సవం సందర్భంగా గిరిజనులను ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. తెలంగాణ మంచినీళ్ల పండుగ సందర్భంగా అన్ని వాటర్ ట్యాంకుల వద్ద గత, ప్రస్తుత పరిస్థితిపై నాడు-నేడు ఫొటోలతో సహా వివరించే ప్రయత్నం చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వా రా ఫ్లోరోసిస్ సమూలంగా నిర్మూలించామని, ఇది గొప్ప విజయమని, ఫ్లెక్సీల ద్వారా ప్రగతిని వివరించాలని అన్నారు. వేడుకలను ప్రతి శాఖ చాలెంజ్గా తీసుకోవాలని, ఆయా శాఖల్లో బాగా పనిచేసి.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందించాలని సూచించారు.
ఉత్సవాల విజయవంతానికి సహకరించాలి : కలెక్టర్లు, ఎస్పీలు
కలెక్టర్లు టి.వినయ్క్రిష్ణారెడ్డి, పమేలా సత్పతి, ఎస్.వెంకట్రావ్, ఎస్పీలు అపూర్వరావు, రాజేంద్రప్రసాద్, డీసీపీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై తీసుకున్న చర్యలను వివరించారు. ఆయా తేదీల్లో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులకు తెలియజేసినట్లు చెప్పారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులతోపాటు ప్రజాప్రతినిధులందరూ కోరారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు రామకృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, సోమ భరత్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాంచందర్నాయక్, తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రేగట్టె అమరేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అణిచివేతలు, అవమానాలతో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని మంత్రి అన్నారు. అందరి భాగస్వామ్యంతో అహింసా, ప్రజాస్వామ్య పద్ధతిలో కేసీఆర్ నేతృత్వంలో రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. కొట్లాడి సాధించిన తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ అద్భుత పరిపాలనతో అనేక రంగాల్లో విజయాలు సాధించారని, మంచి పరిపాలనాధ్యక్షుడిగా విమర్శకుల ప్రశంసలు పొందారని చెప్పారు. వ్యవసాయ రంగంలో రైతులకు విశ్వాసం కలిగించారని, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించారని వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలో రాష్ట్రం నంబర్ వన్గా
ఉన్నదన్నారు.
పంటల సాగును ముందుకు జరుపాలి
పంటల సాగును ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంగళవారం భువనగిరిలో దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. రోహిణి కార్తెలోపు వానకాలం నాట్లు పూర్తి చేయగలిగితే అకాల వర్షాల బారినుంచి తప్పించుకోవచ్చని, తద్వారా పంట నష్టం నుంచి బయటపడవచ్చని ముఖ్యమంత్రి యోచన అన్నారు. రైతాంగం శ్రేయస్సు కోరి సీఎం కేసీఆర్ చేస్తున్న సూచనలను పాటించాలని రైతులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షాలు, వడగండ్ల వానల ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. మారుమూల పల్లెల్లో అభివృద్ధి జాతర కొనసాగుతున్నదని, ఏడు దశాబ్దాల కల సాకారమైన వేల యావత్ తెలంగాణ సమాజం సంబురంగా రాష్ట్ర అవతరణ వేడుకలను జరుపుకొనేందుకు సన్నద్ధం అవుతున్నదని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత కారణమని పేర్కొన్నారు.