రామగిరి, మార్చి 10 : పదో తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 225 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 40, 375 మది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల పర్యవేక్షణకు సిట్టింగ్, ప్లయింగ్ స్కాడ్స్, కస్టోడియన్స్, రూట్ ఆఫీసర్స్ను నియమించారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
జిల్లా కలెక్టర్లు ఇప్పటికే డీఈఓలతో కలిసి సీఎస్, డిపార్టుమెంట్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15వరకు పరీక్షలు జరుగుతాయి. ప్లయింగ్ స్కాడ్స్ బృందంలో ఒక తాసీల్దార్, సీనియర్ గెజిటెడ్ హెచ్ఎం, పోలీసు అధికారులు ఉంటారు. ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి చదివిస్తున్నారు.
టెన్త్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. జంబ్లింగ్ పద్ధతిలో విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించింది. ఉదాహరణకు ఒక పాఠశాలలో 45మంది టెన్త్ విద్యార్థులు ఉంటే ఆ సమీపంలోని 8 సెంటర్లలో కేంద్రాలు వచ్చేలా కార్యాచరణ అమలు చేసింది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించే ఏర్పాటు చేసింది. విద్యార్థులకు హాల్ టికెట్స్ ఈ నెల 11నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. మరో వైపు జిల్లా విద్యాశాఖ కార్యాలయం పరీక్షల విభాగం నుంచి కూడా హాల్ టికెట్స్ ఈ నెల 11 వరకు ఎంఈఓలకు రానున్నాయి. వారు అక్కడి నుంచి సంబంధిత పాఠశాలలకు పంపిస్తారు.
పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష ప్రశ్న పత్రాలను తెరువనున్నారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల ప్యాకింగ్ కూడా అక్కడే చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో 109 పరీక్ష కేంద్రాల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకున్నాం. తాగు నీటితో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచు తాం. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు తెలియజేశాం. ఆర్టీసీ బస్సులను పరీక్షల సమయంలో నడిపేలా సూచించాం. ఎక్కడాఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ