రామగిరి, జనవరి 10 : పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కొన్ని స్కూళ్లు ఇప్పటికే సిలబస్ను పూర్తి చేయగా మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డీసీఈబీ ఆధ్వర్యంలో నిపుణులతో తయారు చేసిన అభ్యసన దీపికలను అందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు 40,372 మంది విద్యార్థులు హాజరవుతుండగా 226 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి విద్యాశాఖకు పంపించారు. ఆమోదం రాగానే పరీక్షల నిర్వహణకు సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్స్ బృందాలతోపాటు సర్వం సిద్ధం చేయనున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు 40,372 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 19,299 మంది, సూర్యాపేట జిల్లాలో 11,944, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9,129 మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 459, సూర్యాపేట జిల్లాలో 344, యాదాద్రి భువనగిరి జిల్లాలో 294 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నల్లగొండ జిల్లాలో 110, సూర్యాపేటలో 67, యాదాద్రిలో 49 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విద్యార్థుల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామ్ బోర్డు(డీసీఈబీ) ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో కలిసి అభ్యసన కరదీపికలు తయారు చేసి ముద్రించింది. ఇప్పటికే వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. వీటితోపాటు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేస్తున్నారు. ఈ పర్యాయం ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలో మెరుగైన స్థానం దక్కేలా కృషి చేస్తున్నారు.
పదో తరగతి విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయం ఇది. ప్రణాళిక ప్రకారం చదువాలని, ఒత్తిడికి గురికాకుండా ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమయ పాలన ముఖ్యమని, కాలక్షేపానికి తావివ్వకూదని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో గడుపడం, కబుర్లు, షికార్లు, బైక్ రైడింగ్లు, సినిమాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇంట్లో చదువుకునే వాతావరణం కల్పించాలని సూచిస్తున్నారు. రాత్రి సమయంలో బలవంతంగా చదువడం వల్ల మెదడుకు చేరకపోగా అనారోగ్యానికి దారితీస్తుందని, అందుకే రాత్రి 11గంటల తరువాత చదువడం మంచిది కాదని చెబుతున్నారు. ప్రణాళికాయుతంగా చదివితే పరీక్షల్లో విజయం సాధించడం సులభమవుతుందని అంటున్నారు.
పదో తరగతి చదివే విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయాలి. విద్యార్థులకు విద్యాశాఖ అందజేసిన అభ్యసన కర దీపికలలోని అంశాలను బోధించాలి. విద్యార్థులకు పరీక్షలంటే భయం లేకుండా చేసి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ