రామగిరి, మార్చి 14: పదో తరగతి పరీక్షలు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 106 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా తొలి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 19635 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో వెళ్లే ముందు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం కనిపించింది. కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పరీక్షల జిల్లా ప్రత్యేక పరిశీలకులు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, డీఈవో బొల్లారం బిక్షపతితోపాటు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను వేర్వేరుగా తనిఖీ చేశారు. ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా పరీక్షలు సవ్యంగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్స్, నల్లగొండ మండలం దోమలపల్లి జెడ్పీహెచ్ఎస్, మునుగోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు అందుబాటులో ఉంచాలన్నారు. టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులను ప్రధాన గేటు వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి పంపించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జీరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. జిల్లాలో ఎకడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడాలని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దన్నారు.