నల్లగొండ రూరల్, డిసెంబర్ 3 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డాన్బాస్కో ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ను శనివారం వారు ప్రారంభించి మట్లాడారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వినూత్న ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్లేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ప్రధానంగా వాతావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం వంటివి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.
బడ్జెట్లో విద్యకు 10 శాతం నిధులు కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు. అదే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు అనేక అంశాలపై తయారు చేసిన 403 ఎగ్జిబిట్స్ ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నెల 5 వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు. ఇన్స్పైర్ మానక్ 2021 -22లో ఎంపికైన 92 ప్రాజెక్టులు సైతం ప్రదర్శనలో ఉంచామని చెప్పారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఇరుగు పెద్దులు, డీఈఓ భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు జాన్శాస్త్రీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సుంకరి భిక్షంగౌడ్, గణపురం భీమయ్య, ఎడ్ల సైదులు, అద్దంకి సునీల్, వీరమల్ల శ్రీనివాస్గౌడ్, నాగరాణి, ట్రస్మా నాయకులు కొలనుపాక రవి కుమార్, నాగేందర్, శ్యాంసుందర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.