యాదాద్రి, సెప్టెంబర్ 21:యాదాద్రీశుడి సన్నిధిలో హస్తకళాకృతులు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో పెంబర్తి స్వర్ణకారులతో ప్రత్యేకంగా తయారు చేసిన తొడుగులను ఆలయ దర్వాజలకు బిగించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్వర్ణకళాకారులతో మాట్లాడి అప్పగించగా ఇత్తడి, వెండి తాపడం పనులు సాగుతున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు 2,600 కేజీల ఇత్తడి, 1,200 కేజీల వెండిని వెచ్చిస్తున్నారు. గర్భాలయం ద్వార దర్వాజకు బంగారు తొడుగులను బిగించనున్నారు.
యాదాద్రిలో ప్రతి కట్టడంలో ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సప్త రాజగోపురాల ద్వారాలకు బంగారు వర్ణపు ఇత్తడి తొడుగులు, ఒక త్రితల రాజగోపురంతోపాటు ఉపాలయాలు, శంకు చక్రాలతోపాటు గరుత్మంతుడి విగ్రహానికి వెండి కవచం పనులు జనగామ జిల్లా పెంబర్తికి చెందిన విశ్వకర్మ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సుమారు 2,600 కేజీల ఇత్తడితో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ పంచతల రాజగోపురాల ద్వారాల దర్వాజలకు పద్మాలు, లతతోపాటు శంకు, చక్రనామాలతో కూడిన ఇత్తడి తొడుగులు బిగించనున్నారు. ఇప్పటికే ప్రధానాలయంలోని దక్షిణం, ఉత్తర భాగంలో గల దర్వాజలకు బిగింపు ప్రక్రియ పూర్తికాగా, తూర్పు, పడమర దర్వాజలకు పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో ద్వార దర్వాజలకు 36 పద్మాలను అమర్చనున్నామని స్వర్ణకారులు తెలిపారు. పద్మాలతో పాటు చుట్టూ తోరణాలు వివిధ ఆకృతులతో తీర్చిదిద్దుతున్నారు. వెండి తొడుగుల తయారీకి కిలోకు రూ.3,800, ఇత్తడి(లోహంతో కలుపుకొని) రూ.3,000 వంతున స్వర్ణకళాకారులకు చెల్లించేందుకు ఆలయ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
త్రితలం, గరుత్మంతుడి విగ్రహం, ఉపాలయాలకు వెండి తొడుగులు..
యాదాద్రిలో ప్రతి కట్టడానికీ చక్కటి రూపాన్నివ్వాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి. ఆలయంలో వెండి, ఇత్తడి లోహాలతో
దగధగలాడే విగ్రహాల రూపకల్పన, ధ్వజస్తంభాలకునగిషీలు దిద్దడం వంటి పనులు చేపట్టారు. 1,200 కేజీల వెండితో స్వామి గర్భాలయానికి వెళ్లే త్రితల రాజగోపురం ద్వార దర్వాజలు, గర్భాలయంలోని 5 ఉపాలయాలు, శంకు చక్రాలు, గరుత్మంతుడి విగ్రహానికి వెండి తొడుగులు చేపట్టనున్నారు. ఆలయంలోని మొత్తం 6 పంచతల, ఒక సప్తతల రాజగోపురాలకు గల ద్వారాల దర్వాజలకు ఇత్తడి తొడుగులు, ఒక త్రితల రాజగోపురానికి గల ద్వార దర్వాజలకు వెండి తొడుగులు బిగించనున్నారు. గర్భాలయ ద్వార దర్వాజకు బంగారంతో తయారు చేసిన తొడుగులను బిగించనున్నారు.
పెంబర్తి హస్తకళాకారులను పనులను అప్పగించిన సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిలా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. దర్వాజలకు వెండి తొడుగుల తయారీ పనులను తక్కువ ధరకే చేపట్టేందుకు చెన్నైకి చెందిన ఓ కార్పొరేట్ సంస్థ ముందుకొచ్చింది. కానీ, సీఎం కేసీఆర్ పెంబర్తి కళాకారులకు ప్రాధాన్యమిచ్చారు. తిరుమల శ్రీవారి చేతిలోని శంఖుచక్రాలు, సంక్రాంతి పర్వదినాన గంగిరెద్దులవారికి టీటీడీ అందించే అక్షయపాత్రలు పెంబర్తి హస్తకళాకారుల చేతిలోనే తయారయ్యాయి. భద్రాచలంలో ఇత్తడి రథాలు, కిరీటాలు, మకరతోరణాలు, కాళేశ్వరం గర్భాలయంలో వెండి తొడుగులు, నందీశ్వరుడికి తొడుగులతో పాటు అమెరికాలోని టెక్సాస్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కిరీటం పెంబర్తి కళాకారులే రూపొందించడం విశేషం.
నవంబర్లోగా పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు..
ప్రధానాలయంలోని లోపలిభాగంలో ఉత్తరం, దక్షిణం భాగంలో గల రెండు 13 ఫీట్ల పొడవైన దర్వాజలకు ఇత్తడి తొడుగుల పనులు పూర్తయ్యాయి. ఆలయంలోకి వెళ్లే తూర్పు, ఉత్తర, దక్షిణం భాగంలో గల పంచతల రాజగోపురాలు, పడమర సప్తతల రాజగోపురాలకు ఇత్తడి తొడుగుల పనులు సాగుతున్నాయి. మరో పదిరోజుల్ల్లో అవి పూర్తికానున్నాయి. అనంతరం వెండి తొడుగుల పనులను ప్రారంభించనున్నారు. త్రితల రాజగోపురం,హనుమంతుడు, గరుత్మంతుడి విగ్రహాలకు తొడుగులను తయారు చేస్తున్నారు. గర్భాలయ ముఖ మండపంలో 6 ఉపాలయాలకు ఒక్కో దర్వాజకు 75 కిలోల వెండిని వినియోగించుకుని తొడుగులను తయారు చేయనున్నారు. ఇత్తడి దర్వాజల తొడుగుల బిగింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం వెండి తొడుగుల పనులను ప్రారంభించనున్నారు. నవంబర్ 2వ వారంలోగా పనులను పూర్తి చేస్తామని పెంబర్తి స్వర్ణ కళాకారులు చెబుతున్నారు.
ఇది మా అదృష్టం..
రాష్ట్రం ఏర్పాటయ్యాక యాదాద్రి దేవాలయానికి ప్రతిష్టాత్మక రూపమిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. నిర్మాణాలు వెయ్యేండ్ల పాటు చరిత్రలో నిలిచిపోయేలా పనులు జరుగుతున్నాయి. ఈ మహాకార్యంలో పెంబర్తి కళాకారులను భాగస్వాములను చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.