కేతేపల్లి, జూన్ 13: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 640.85(3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. నెల రోజులుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, జనగామ, వరంగల్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో నిలకడగా 400 క్యూసెక్కులకు పైగా వస్తున్నది.
ఏప్రిల్లో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల నిలిపి వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు17 అడుగుల మేరకు ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. ఇన్ఫ్లో ఇదేస్థాయిలో కొనసాగితే ఈ నెల చివరి వరకు నీటిమట్టం 645 అడుగులకు పెరిగే అవకాశం ఉన్నది. ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటం, వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో అధికారులు ప్రాజెక్ట్ కాల్వలకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.