ఆదుకున్న మంత్రికి కృతజ్ఞతగా పుట్టిన రోజు వేడుకలు
నీలగిరి, జూలై 24 : కష్టకాలంలో సొంత అన్నలా ఆదుకున్న మంత్రి కేటీఆర్పై ఆమె ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. బతుకు దారి చూపిన మంత్రి జన్మదినాన్ని పండుగలా నిర్వహించింది. కృతజ్ఞతగా ప్రభుత్వ అసుపత్రిలో ప్రతి రోగి వద్దకు స్వయంగా వెళ్లి పండ్లు పంచిపెట్టింది ఏఎన్ఎం కరిష్మా. గత డిసెంబర్ 31న మంత్రి కేటీఆర్ నల్లగొండ పట్టణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో రోడ్డు పక్కన పూలు అమ్ముతున్న రామన్నపేటకు చెందిన 19ఏండ్ల కరిష్మాను మంత్రి కేటీఆర్ గమనించాడు. చదువుకోకుండా పూలు ఎందుకు అమ్ముతున్నావని ప్రశ్నించారు.
తాను ఇంటర్ చదువుకున్నానని, తన తండ్రి చనిపోయాడని, అన్న హత్య చేయబడ్డాడని, పూలు అమ్ముతూ తన చెల్లిని, తల్లిని పోషిస్తున్నాని కరిష్మా చెప్పింది. దీంతో చలించిన మంత్రి కేటీఆర్.. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిని తక్షణమే ఉపాధి కల్పించాలని ఆదేశించారు. దీంతో ఆమెకు వైద్యారోగ్య శాఖలో ఏఎన్ఎంగా ఉద్యోగం ఇవ్వగా.. ప్రస్తుతం పానగల్ రోడ్డులోని యూహెచ్సీలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నది. తన కుటుంబానికి అన్నలా అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని ఆదివారం పండుగలా నిర్వహించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి వార్డుకు వెళ్లి రోగులందరికీ పండ్లు పంచిపెట్టి మంత్రిపై తన అభిమానాన్ని చాటుకుంది.