యాదాద్రి, నవంబర్ 28 : కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చి, ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారి దేశాన్ని కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని చూస్తున్న ప్రధాని మోదీని గద్దె దించేందుకు కార్మికులంతా ఏకమవ్వాలని ఎఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్ పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న ఏఐటీయూసీ 3వ రాష్ట్ర మహాసభల రెండో రోజు సోమవారం జరిగిన ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులకు సంపదను ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని చెప్పారు. సంపన్నులు తీసుకున్న రూ. 10 లక్షల కోట్ల రుణాలను ఎన్సీఏ కింద రద్దు చేశారన్నారు.
కార్మిక చట్టాలను 4 లేబర్కోడ్లుగా మార్చే సమయంలో కార్మిక సంఘాలతో ఎందుకు సంప్రదించలేదో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ తన ఎనిమిదేండ్ల పాలనలో లక్షల ఉద్యోగులను రోడ్డుపై పడేలా చేశారన్నారు. ఈ విషయమై ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ అధికారులతో దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం, బ్యాంకులు, ఇన్సూరెన్స్, బొగ్గు, ఉక్కు, విమానయానం, రైల్వే, పోర్టులు, పోస్టాఫీసులు, బీఎస్ఎన్ఎల్, ఆయిల్ కంపెనీలు, ఓఎన్జీసీ, బీఏఈ, ఇస్రో వంటి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని తెలిపారు.
జనవరిలో 10 జాతీయ కార్మిక సంఘాలతో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రక్షణ రంగం ప్రైవేటీకరణ నిలిపివేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేల అమలు చేయాలని సభలో తీర్మానించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాల్రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ యూసుఫ్, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఉజ్జిని రత్నాకర్రావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, బి. వెంకటేశం, మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, కోశాధికారి గోరేటి రాములు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.