సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్ను కాంట్రాక్టర్లు సరిచూసుకోలేదు. దాంతో కాల్వలోకి నీళ్లు రాక సుమారు 150 ఎకరాలపైనే పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులు ఈ సమస్యపై మంత్రికి రెండు రోజుల క్రితం వాట్సాప్లో పోస్ట్ చేయగా వెంటనే స్పందించి కాల్వ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో పునరుద్ధరించడంతో కాల్వలోకి నీళ్లు పారుతున్నాయి. తమ కష్టాలు తీర్చిన మంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సూర్యాపేట రూరల్, మార్చి 14 : రైతుల కష్టాలు రైతులకే తెలుసంటారు. రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి స్వతహగా వ్యవసాయాన్ని ఇష్టపడే సూర్యాపేట శాసనసభ్యుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కష్ట కాలంలో తోటి రైతులకు ఆసరాగా నిలిచి వారి కళ్లలో ఆనందం నింపారు. మంత్రి చొరవతో ఎండిపోతున్న వందల ఎకరాల పంట పొలాలు తిరిగి జీవం పోసుకున్నాయి. మూసీ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ సింగిరెడ్డిపాలెం-తాళ్లకాంపాడ్ గ్రామ రైతుల భూములకు వెళ్లే 36వ డిస్ట్రిబ్యూటరికి సంబంధించిన కాల్వకు అనుసంధానంగా మరో మైనర్ కాల్వ ఉంది. అయితే కొంతకాలం కిందట పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో కాల్వపై రహదారిని నిర్మించే సమయంలో కాల్వ గూనల లెవెల్ను గుత్తేదారులు సరి చూస్కోలేదు. దీంతో కాల్వకు నీరు ఎక్కకపోవడంతో సింగిరెడ్డిపాలెం- తాళ్లకాంపాడ్ గ్రామాల రైతులకు చెందిన వందలాది ఎకరాలు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
రైతులు తమ సమస్యను విన్నవిస్తూ రెండ్రోజుల క్రితం మంత్రి జగదీశ్రెడ్డికి వాట్సాప్ ద్వారా పంపారు. వెంటనే స్పందించిన మంత్రి జగదీశ్రెడ్డి పంచాయతీ, ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 గంటల్లో మూసీ కాల్వను పునరుద్ధరించి నీరు ప్రవహించే విధంగా చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో కదిలిన ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు 24 గంటల్లోపే కాల్వకు మరమ్మతు చేసి నీరు వెళ్లే విధంగా పునరుద్ధరించారు. దీంతో ఎండిపోయే స్థితిలోకి వెళ్లిన పంటలు తిరిగి జీవం పోసుకున్నాయి. వాట్సాప్ ద్వారా సమస్యను తెలిపినా తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రైతు బాంధవుడు జగదీశ్రెడ్డి అని కొనియాడారు.