జిల్లా అంతటా నూతన తెలుగు సంవత్సరం శ్రీ శోభకృత్ ఉట్టిపడుతున్నది. ఆలయాల్లో ఉగాది పచ్చడి పంపిణీతోపాటు పంచాంగం శ్రవణానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పచ్చడి కుండలు, మామిడి కాయల కొనుగోళ్లతో మంగళవారం సాయంత్రం మార్కెట్లో సందడి కనిపించింది. దేవస్థానం ప్రధాన పురోహితుడు సత్యనారాయణశర్మ, సూర్యాపేట పట్టణానికి చెందిన అర్చకుడు వి.వీరభద్రశర్మకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉగాది పురస్కారాన్ని ప్రకటించింది. ఉమ్మడి జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేటలో జిల్లా వైదిక బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రకృతి అందించే శక్తికి ఉగాది నిర్వచనమని, అటువంటి శక్తి ఆశీస్సుతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
సూర్యాపేట టౌన్, మార్చి 21 : శుభకృత్ నామ సంవత్సరమంతా శుభమే జరగాలని.. ప్రకృతి కరుణించి ప్రజలంతా ఐక్యతతో సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఉద్యమ కాలంలోనే అందరి కష్టాలు తెలుసుకుని.. పారాడి రాష్ర్టాన్ని సాధించి.. నిరంతరం అభివృద్ధి పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణతోపాటు దేశానికి శ్రీరామరక్ష అని కొనియాడారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా వైదిక బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభకృత్ నామ సంవత్సర పంచాగాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించుకుందామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత తొమ్మిదేండ్లుగా నిరంతర విద్యుత్, పుష్కలంగా నీరు అందుతుండటంతో పాడి పంటలు సమృద్ధిగా పండి అందరి కండ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ఈ ఏడాది కూడా ప్రకృతి కరుణించి వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలతో తులతూగాలని ఆకాంక్షించారు. రాష్ర్టాన్ని సాధించుకున్న అనతికాలంలోనే ఎంతో ప్రగతి సాధించుకున్నామని, రాబోయే రోజుల్లోనూ మరింత అభివృద్ధితో ముందుకు సాగుదామన్నారు. అన్ని రంగాల అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారనారు. యాదాద్రిని అద్బుత క్షేత్రంగా తీర్చిదిద్దిన గొప్ప ఆధ్యాత్మికవేత్తగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి సంప్రదాయ పద్ధతిలో ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ ఆదుర్తి రామయ్య, ఆకునూరి పాండురాంగాచార్యులు, డాక్టర్ రమేశ్చంద్ర, సుబ్రహ్మణ్యశాస్త్రి, అర్చకులు పాల్గొన్నారు.
మండలి చైర్మన్ గుత్తా ఉగాది శుభాకాంక్షలు
నీలగిరి, మార్చి 21 : ఉమ్మడి జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరికీ కలిసివచ్చి సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న రాష్ట్రం శోభకృత్ నామ సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని, అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు
సూర్యాపేట టౌన్, మార్చి 21 : వేప పూత, మామిడి కాయ, చింతపండు వంటి ప్రకృతి అందించే షడ్రుచుల సమ్మేళనానికి ఉగాది పర్వదినం ప్రతీతి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అదే ప్రకృతి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శోభకృత్ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మరింత పురోగతి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
-రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
ఉగాది పురస్కారానికి వీరభద్రశర్మ ఎంపిక
సూర్యాపేటటౌన్, మార్చి 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హైదరాభాద్ రవీంద్ర భారతిలో అందించే ఉగాది పురస్కారానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, సూర్యాపేట అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు వలివేటి వీరభద్రశర్మ ఎంపికయ్యారు. ఉగాది పురస్కారానికి ఎంపిక కావడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని దేవాలయాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని కొనియాడారు. 1990లో అర్చక ఉద్యోగం పొందిన ఆయన 2017లో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ ఏడాది ఉగాది పురస్కారానికి ఎంపికవడంపై పలువురు అభినందనలు తెలిపారు.
గుట్ట ప్రధాన పురోహితుడికి ఉగాది పురస్కారం
యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మకు ఉగాది పురస్కారం-2023 వరించింది. గత 38 ఏండ్లుగా పురోహితంలో విశిష్ట సేవలందించినందుకు గానూ ఆయనకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ పురస్కారం ప్రకటించారు. బుధవారం ఉగాది సందర్భంగా రవీంద్రభారతిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొని పురస్కారం అందుకోనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో 1985 అక్టోబర్ 21న రికార్డు అసిస్టెంట్ హోదాలో ఆయన నియమితులయ్యారు. పదేండ్ల అనంతరం జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఆ తరువాత అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ హోదాలో పురోహితుడిగా సేవలందించి ప్రస్తుతం ప్రధాన పురోహితుడిగా పనిచేస్తున్నారు. స్వామివారి క్షేత్రంలో 15ఏండ్లుగా పంచాంగ శ్రవణం చేస్తున్నారు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగే దేవీనవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలు, కార్తిక మాసం పూజలు ఇతని ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి.