యాదాద్రి, మే 31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దేశంలోనే గొప్ప దేవాలయంగా వెలుగొందుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. యాదాద్రీశుడిని మంగళవారం మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదాద్రికి చేరుకున్న ఆయన నేరుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం మంత్రికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దాదాపు 300 ఏండ్ల చరిత్రను గమనిస్తే ఇంత పెద్ద దేవాలయాన్ని పునర్నిర్మించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో రూ.1600 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని పూర్తి కృష్ణశిలతో పునర్నిర్మించారని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంతో యాదాద్రి భువనగిరి జిల్లా దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధ్ది చెందిందన్నారు.తిరుపతి తరహాలో యాదాద్రి దేవాలయం అభివృద్ధి చెందుతున్నారు. ఇంత గొప్ప ఆలోచన సీఎం కేసీఆర్కు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ దేవాలయాలు నిరాదరణకు గురయ్యాయని, అప్పటి ప్రభుత్వాలు ఆలయాలను పట్టించుకోలేదని విమర్శించారు. యాదాద్రి దేవాలయంతోపాటు రామప్ప, వేములవాడ, జోగులాంబ వంటి ఎన్నో దేవాలయాలను వెలుగులోకి తీసుకొచ్చి, వాటి విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. యాదాద్రి పునర్నిర్మాణంతో ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, రైతు బంధు సమితి కన్వీనర్ మిట్ట వెంకటయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముక్యర్ల సతీశ్యాదవ్ పాల్గొన్నారు.