నాగర్కర్నూల్: గ్రామాల్లో ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయకుంటే అధికారులు సెలవుపై వెళ్లాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతోనూ అధికారులు మమేకమై అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులు నిర్ధాక్ష్యంగా ఉద్యోగాలు మానేయాలన్నారు. బుధవారం నాగర్కర్నూల్ ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ నర్సింహారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరు కాగా ముందుగా సమావేశంలో వ్యవసాయంపై చర్చ జరిగింది.
బొందలపల్లి సర్పంచ్ మల్లేపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మండల వ్యవసాయాధికారి నర్మద రైతులతో సమన్వయంతో పనిచేయడం లేదని, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదన్నారు. దీంతో ఏవో పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఉండి పని చేయాలని, మీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే ఉద్యోగం వదిలి వెళ్లాలని మండిపడ్డారు. ఏ గ్రామంలో తిరిగి రైతులు సమస్యలు తెలుసుకున్నారని ప్రశ్నించారు. మండలంలోని చాలా గ్రామాల నుంచి మీపై ఫిర్యాదులు వస్తున్నా యని, సరిచేసుకోకుంటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
మండల అధికారిగా ఏ రైతు ఫోన్ చేసినా సలహాలు ఇవ్వాల్సిందిపోయి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మరోసారి రైతుల నుంచి కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కానీ మీపై ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి సమావేశంలోనూ అధికారులు సమావేశాలకు రావాలని, ప్రజాప్రతినిధుల నుంచి గ్రామాల్లోని ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతులకు సీజన్ల వారీగా కావాల్సిన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నవి అందించే బాధ్యత వ్యవసాయాధికారులపై ఉందన్నారు. వచ్చే సీజన్కు మండలానికి కావాల్సిన విత్తనాలకోసం ఇండెంట్ పంపించారా అని ప్రశించారు.
రైతు ఏ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నరనే విషయాలను తెలుసుకొని సరైన సమయంలో వాటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకా చాలా వరకు రైతులు లాభ పడుతున్నారని, మరింత వారి అభివృద్ధికి వ్యవసాయాధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత పరిస్థితులకంటే ప్రస్తుతం ఎంతో వృద్ధి చెందారన్నారు. పుష్కలంగా నీరందడం వల్ల వరిసాగు విస్తీర్ణం పెరిగి అత్యధిక పంట చేతికి రావడంతో మన రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. రైతుల అభివృద్ధికి ఏఈవోలు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. ప్రస్తుతం ఫుడ్ కార్పొరేషన్ వడ్లుకొనే పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సన్న రకాలను పండించేందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
అధికారులకు, ప్రజాప్రతినిధుల మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అన్ని గ్రామాల్లోనూ సమస్యలను అధికారులు బాధ్యతగా తీసుకొని ప్రజ లతో మమేకమై పనిచేయాలన్నారు. అనంతరం విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, పశుసంవర్ధక తదితర శాఖలపై సమావేశం లో చర్చించారు. ఏశాఖకు చెందిన అధికారి అయినా తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించినపుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, జడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, సింగిల్విండో చైర్మన్ బండారు శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు, అధికారులు కోటేశ్వర్రావు, అన్ని శాఖల మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.