KCR | అతిగా ప్రవర్తిస్తున్న కొంతమంది పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పటాన్చెరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. మీరు అతిగా ప్రవరిస్తున్నారని తెలిసిందని పోలీసులనుద్దేశించి అన్నారు. రేపొచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. జాగ్రత్త అని హెచ్చరించారు. ఆనాడు మేం లాఠీలు, లూఠాలు, తుపాకులు, జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు. కాబట్టి అతిగా పోవద్దని సూచించారు. మీ డ్యూటీలు మీరు చేసుకోండి.. మీకు రాజకీయాలు అవసరం లేదని హితవు పలికారు.
మన ఐకమత్యమే మనకు శ్రీరామరక్ష అని కేసీఆర్ అన్నారు. అందరం కలిసే ఆనాడు తెలంగాణను తెచ్చుకున్నాం.. ఈనాడు దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీల నుంచి తెలంగాణను రక్షించుకోవాలన్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ డజనుకు పైగా స్థానాల్లో గెలవాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ డజనుకుపైగా స్థానాల్లో గెలిస్తేనే పార్లమెంటులో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తదని.. ఆ విధంగా అయినా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. దేవుడు ఇచ్చిన ఈ ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని వ్యాఖ్యానించారు. ప్రజలే తనకు అండదండ అని.. ప్రజలే తనకు ఇన్స్పిరేషన్ అని.. ప్రజలే తనకు ఊపిరి అని పేర్కొన్నారు.
వెంకట్రామిరెడ్డి గెలిస్తే 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తానని అన్నాడని కేసీఆర్ తెలిపారు. ఆయన సొంత నిధులతో ప్రతి నియోజకవర్గంలో ఒక కల్యాణ మండపం కట్టించి, ఒక్క రూపాయికే పేదలకు పెండ్లి చేయిస్తానని చెప్పారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి డబ్బుల కోసం, పలుకుబడి కోసం రాలేదని తెలిపారు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడని చెప్పారు. ఆయన ఎంపీగా నిలబడతా అని తనను అడగలేదని అన్నారు. మెదక్ పెద్ద నియోజకవర్గం కాబట్టి.. చదువుకున్న వాళ్లు ఉండాలనే ఉద్దేశంతో తానే స్వయంగా వెంకట్రామిరెడ్డిని పోటీ చేయాలని అడిగినట్లు చెప్పారు. నేనే నిలబెట్టిన కాబట్టి నా మాట గౌరవించి, వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు.