కందనూలు, జూన్ 23 : ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం చేపట్టిన లక్ష్యాలను వంద శాతం ప్రతి అధికారి నెరవేర్చాలని జెడ్పీ చైరపర్సన్ పద్మావతి బంగారయ్య అన్నారు. బుధవారం కార్యాలయంలో స్థాయీ సంఘం సమావేశాలను ఆయా శాఖల జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి, సంక్షేమ అమలు తీరుపై చర్చించారు. 2వ స్థాయీ సంఘం సమావేశానికి పద్మావతి అధ్యక్షత వహించగా, 3వ స్థాయీ సంఘం సమావేశానికి ఉపాధ్యక్షుడు బాలాజీసింగ్ అధ్యక్షత వహించి సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ చైరపర్సన్ మిషన్ భగీరథ, పౌర సరఫరాలు, పరిశ్రమ శాఖ, విద్యుత్ శాఖ, చేనేత, క్రీడలు తదితర శాఖల అధికారులతో మాట్లాడారు. ఇప్పటికీ పలు శాఖల వారు అలసత్వం వహిస్తున్నారని తమ దృష్టికి ప్రజలు పలు సమస్యలు తెచ్చారని వాటిని సంబంధించిన శాఖల వారు పరిష్కరించుకోవాలన్నారు. గ్రామాల్లో, పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు లేక తీగలు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయని, వాటిని సరి చేయాలని, జిల్లాలో మూడు 3 స్టేడియంలు ఉన్నాయని, వాటి నిర్వహణ బాధ్యత ఆ శాఖ వారు మరిచారని, వాటిపై తమకు నివేదిక ఇవ్వాలన్నారు, ఉపాధి హామీ పనులు కోసం త్వరగా జాబ్కార్డులు అందజేసి వారికి కూలి కల్పించాలని, పనులపై గ్రామాల్లో దండోరా వేయించాలన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రతి పనిపై ప్రతి అధికారి నిబద్ధత ఉంచి పని చేసి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను కోరా రు. ప్రతి అధికారి సమన్వయంతో పని చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు.