కల్వకుర్తి రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా 18 సంవత్సరాలు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందజేస్తున్నదని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని నాగర్కర్నూల్ ఎంపీ రాములు కోరారు. సోమ వారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన డీఎంహెచ్వో సుధాకర్ లాల్తో కలిసి పర్యవేక్షించారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఏ మాత్రం అపోహ పడొద్దన్నారు.
జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల డెభ్భై వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని ఇంకా రెండు లక్షల యాభైవేల మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉం దన్నారు. జిల్లా వ్యాప్తంగా 254సెంటర్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాదేశా నుసారం రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని మొదటి డోస్ పూర్తైన వారు రెండో డోస్ తీసుకోవాలన్నారు. కరోనా కట్టడిలో వైద్య సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, చాలా బాగా పనిచేశారని వ్యాక్సిన్ పంపిణీ లోనూ అదే స్ఫూర్తితో పని చేస్తున్నారని వారిని అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తీర్చేందుకు కృషి చేస్తున్నదని ఈ క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరో నాలుగు మల్టీ స్పెషాలిటీ దవాఖానలను, జిల్లా కేంద్రాలలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ అందజేశారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ షాహిద్, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఎంపీపీ సునీత వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.