మాస్కో : రష్యా రాజధాని మాస్కోలో కొత్త కరోనా కేసులు పెరిగాయి. కేసుల పెరుగుదల వెనుక కరోనా కొత్త వేరియంట్ కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొత్త వేరియంట్ను గుర్తించగా దానికి ‘మాస్కో వేరియంట్’గా పేరు పెట్టారు. రష్యా రాజధానిలో కొన్ని వారాల్లో కేసులు మూడు రెట్లు పెరిగాయి. దీంతో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అదే సమయంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ కంపెనీ స్ట్రెయిన్కు వ్యతిరేకంగా టీకా ప్రభావాన్ని తెలుసుకునే పనిలో పడింది. మాస్కోలో శుక్రవారం 9,056 కొత్త కేసులు గుర్తించారు. రెండు వారాల కిందట ఈ సంఖ్య 3వేలు ఉండగా.. 2020లో మొదట్లో కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.
మాస్కోలో జనాభా 1.20 కోట్లు. కొత్త కేసులు వేగంగా పెరగడంతో మాస్కో వేయర్ సెర్గీ సోబయానిన్ వారం పాటు పెద్ద ఎత్తున ఆంక్షలు ప్రకటించారు. లుజ్నికి స్టేడియం వెలుపల యూరో-2020 ఫ్యాన్ జోన్ సంఖ్యను పరిమితం చేశారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలకు వెయ్యి మందికిపైగా ఆహ్వానించొద్దని, వినోద కార్యక్రమాలపై నిషేధం నిషేధించారు. డాన్స్ హాల్స్, ఫ్యాన్ జోన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నెల 29 వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫుడ్ హాల్స్, మాల్స్, జూస్, ఆట స్థలాలు, బార్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.
మాస్కో నగరంలో కరోనా కొత్త కేసుల పెరుగుదలతో కొత్త స్ట్రెయిన్ ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఇన్ఫెక్షన్ మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. మాస్కోలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, స్పుత్నిక్-వీ టీకా తయారీ కంపెనీ గమలేయా ఇన్స్టిట్యూట్ డిప్యూటీ హెడ్ డెనిస్ లోగునోవ్ పేర్కొన్నారు. గమలేయా సెంటర్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్బర్డ్ను ఉటంకిస్తూ.. మాస్కో స్ట్రెయిన్కు వ్యతిరేకంగా టీకా సామర్థ్యంపై అధ్యయనం చేస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, వైరస్పై వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని నమ్ముతున్నట్లు గింట్స్బర్గ్ పేర్కొన్నారు. ఇంకా అధ్యయనం ఫలితాలు రావాల్సి ఉన్నది.