కలెక్టర్ వీపీ గౌతమ్
తొర్రూరు, ఏప్రిల్ 30 : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గాంధీ పార్క్ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ పనులు పూర్తి చేసి, నెల రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జీప్లస్ వన్ తరహాలో నర్మిస్తున్న ఈ మార్కెట్లో మొదటి అంతస్తులో మాంసాహార విక్రమాలు, కింది భాగంలో కూరగాయల విక్రయాలు చేపట్టేలా చర్య లు తీసుకోవాలని తెలిపారు. తొర్రూరులోని అంగడి స్థలంలో మరొక మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దుబ్బతండాలో ఆధునిక సౌకర్యాలతో కూడిన వైకుంఠధామాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.
పార్కు నిర్మాణం బాగుంది.
యతిరాజారావు స్మారక చిల్డ్రన్స్ పార్క్ ఎంతో బాగుందని కలెక్టర్ గౌతమ్ అన్నారు. పార్క్లో పచ్చదనం ఉట్టిపడేలా నాటిన మొక్కలు, పిల్లల ఆహ్లాదంకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, వివిధ రకాల బొమ్మలు, వాటర్ ఫౌంటేన్, వాకింగ్ ట్రాక్తో పాటు పలు నిర్మాణాలను పరిశీలించారు. ఈ పార్క్ జిల్లాలోనే అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శనంగా నిలుస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, తహసీల్దార్ రాఘవారెడ్డి, ధరావత్ జైసింగ్, చిదిరాల చంద్రయ్య, అధికారులు పాల్గొన్నారు.
వారంలో తొర్రూరు పీహెచ్సీలో కొవిడ్ పరీక్షలు..
కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సేవలను మెరుగుపర్చడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. వారం రోజుల్లో తొర్రూరు పీహెచ్సీలో, గార్ల దవాఖానలో కరోనా బాధితులకు చికిత్సలు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తొర్రూరు పీహెచ్సీని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఆకస్మికంగా సందర్శించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడారు. తొర్రూరు పీహెచ్పీలో అన్ని వార్డులను సౌకర్యాలను పరిశీలిస్తూ వారం రోజుల్లో 30 పడకలకు ఆక్సిజన్తో కూడిన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధిందచిన పనులను సత్వరమే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. దవాఖానలో వ్యాక్సినేషన్ తీరును పరిశీలించి, తహసీల్దార్ రాఘవారెడ్డి, వైద్యాధికారి దిలీప్ సమన్వయంతో చేసిన ఏర్పాట్లను చూసి వారి సేవలను అభినందించారు. 18 ఏండ్లు పైబడిన వారికి సైతం టీకాలు వేయనున్నందున తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో అదనపు వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతూనే ప్రజలకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరాం, జిల్లా కొవిడ్ నోడల్ అధికారి రాజేశ్, డిప్యూటీ డీఎంహెచ్వో మురళి, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జిల్లా పరిషత్ ఫ్లోర్లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, ఎంపీడీవో భారతి, డాక్టర్ దిలీప్కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.