మధ్యవర్తిగా ఉన్నందుకు ప్రాణాలు పణం
ఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురి వంచన
వారిని నమ్మి నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు..
మోసపోయామని తెలిసి బాధితులకు తిరిగివ్వలేక మనస్తాపం
పురుగుల మందు తాగి భార్యాభర్తల బలవన్మరణం
కారకులపై చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా పోలీసులకు వేడుకోలు
పరకాల, జూలై 30 : మోసం.. ఒత్తిడికి దంపతులు బలయ్యారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ముగ్గురు వ్యక్తులు వీరిని మధ్యవర్తిగా పెట్టి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఆపై ఉద్యోగాలు ఇప్పించకుండా, డబ్బులు వాపస్ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతుండడంతో భార్యాభర్తలు తాళ్లపల్లి కేశవ స్వామి (53), సంధ్యారాణి (45) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పరకాలలో గురువారం రాత్రి జరిగింది. మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం పోనకల్ గ్రామానికి చెందిన కేశవ స్వామి వరంగల్లో ఓ పెస్టిసైడ్ కంపెనీలో పని చేసేవాడు. ఆ సమయంలో ధర్మసాగర్ విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్గా విధులు నిర్వర్తించే పుల్లా బాబు, అదే శాఖలో కాంట్రాక్టర్ బాలు నాయక్, గాడిపల్లి వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడింది.
ఈక్రమం లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తెలిసిన వారు ఉంటే ఉద్యోగాలు ఇప్పిస్తామం టూ వీరు కేశవ స్వామిని నమ్మించారు. దీంతో ము లుగు, వరంగల్, డోర్నకల్, అచ్చంపేటకు చెందిన పలువురి నుంచి కేశవ స్వామి దంపతులు సుమారు రూ. 80లక్షలు వసూలు చేసి వారికి చెల్లించారు. వారు ఉద్యోగాలు ఇప్పించకుండా కాలయాపన చేస్తుండడంతో డ బ్బులు ఇచ్చిన వారు కేశవ స్వామిని ఉద్యోగాలు ఇప్పించాలని, లేకపోతే డబ్బులైనా వాపస్ చేయాలని ఒత్తిడి చేయసాగారు. దీంతో కేశవ స్వామి పుల్లా బాబు, గాడిపెల్లి వెంకటేశ్వర్లును ఉద్యోగాలైనా ఇప్పించండి.. లేదా డబ్బులైనా చెల్లించాలని అడిగాడు. వారు డబ్బులు ఇవ్వకపోగా కేశవస్వామిని బెదిరించారు. మోసపోయామని తెలిసి బాధితులకు డబ్బులు తిరిగివ్వలేక కేశవ స్వామి దంపతులు మనోవేదనకు గురయ్యారు. ఈక్రమంలో వారు ప్రార్థనలు చేసేందుకు రువారం పరకాలలోని ఓ చర్చికి వచ్చారు. ప్రార్థనలు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతుండగా సంధ్యారాణి పురుగుల మందు తాగింది. గమనించిన భర్త కేశవస్వామి ఆమెను దవాఖానకు తరలించేలోపు మృతి చెందింది. భార్య సంధ్యారాణి మృతిని తట్టుకోలేని కేశవ స్వామి అక్కడే ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మోసం చేసిన వారిని శిక్షించాలంటూ వీడియో..
ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడడమే కాకుండా డబ్బులు అడిగితే తనను బెదిరింపులకు గురి చేసిన పుల్లా బాబు, గాడిపల్లి వెంకటేశ్వర్లు, బాలు నాయక్పై చర్యలు తీసుకుని డబ్బులు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వాలని ఆత్మహత్యకు ముందు కుటుంబంతో కలిసి కేశవస్వామి వీడియో తీశాడు. తన కుటుంబం ఆర్థికంగా చితికి పోవడంతో పాటు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వీడియోలో పేర్కొన్నాడు. దళారులపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్, డీజీపీని కోరారు. మృతురాలి తమ్ముడు వేముల కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ బాబు తెలిపారు.