ప్రజాసేవతోనే తగిన గుర్తింపు
ప్రాణమున్నంత వరకు ప్రజల్లో ఉంటా
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్, మే 3: ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తే తగిన గుర్తింపు వస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పుర ఎన్నికల ఫలితాల సందర్భంగా సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు.
ఓటమిపాలైన అభ్యర్థులు ప్రజా క్షేత్రంలో ఉంటే భవిష్యత్తులో తగిన గుర్తింపు వస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికే పట్టణంలో వంద పడకల దవాఖాన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయ్యాయన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎన్టీఆర్ మినీ, ఇండోర్ స్టేడియం, వ్యవసాయ మార్కెట్ ప్రహరీ విస్తరణ, మొదలైన అభివృద్ధి పనుల పూర్తికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చేందుకే రోడ్లను తవ్వించామని, మరో మూడునెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే 24 గంటలపాటు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. పుర ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు నర్సింహాగౌడ్, శ్రీను, నిజాం, ఖలీల్ తదితరులు ఉన్నారు.