పైసా ఖర్చు లేకుండా ‘టీ డయాగ్నస్టిక్’ సేవలు
ఇప్పటివరకు 8,317మందికి రూ.35లక్షల విలువైన టెస్టులు
జనగామలో 536మందికి, మహబూబాబాద్లో 5వేలు, ములుగులో 2781మందికి మేలు
తప్పిన ప్రైవేట్ ల్యాబ్ ఫీజుల దోపిడీ
ప్రతి జిల్లా దవాఖానలో రూ.3కోట్లతో సెంటర్ ఏర్పాటు
అత్యాధునిక మిషన్లతో 57 రకాల నిర్ధారణ టెస్టులు ఫ్రీ
ప్రతి రోజూ సుమారు 50మందికి పరీక్షలు
ములుగు, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఏదైనా రోగం వచ్చిందని వెళ్తే చాలు.. రకారకాల టెస్టుల పేరుతో ‘ప్రైవేట్’ ల్యాబ్లు దండుకునే ఫీజులకు లెక్కేలేదు. ఫలితంగా ఎంతోమంది సామాన్యులు, పేదలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ‘టీ డయాగ్నస్టిక్’ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి జిల్లా దవాఖానలో సుమారు రూ.3కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో రక్త, మూత్ర పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్ నిర్ధారణ, పాథాలజీ, లివర్ ఫంక్షన్.. ఇలా 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నది. గత నెలలో ఈ సేవలు ప్రారంభం కాగా ఇప్పటివరకు జనగామలో 536, మహబూబాబాద్లో 5వేలు, ములుగులో 2,781మందికి రూ.35లక్షల విలువైన టెస్టులు ఉచితంగా చేయించి ఆర్థిక భరోసానిచ్చింది. ప్రైవేట్లో వేల రూపాయలుండే ఖరీదైన పరీక్షలను ఉచితంగా చేస్తుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభు త్వం.. రోగ నిర్ధారణ కోసం ఉచితంగా పరీక్షలు చేయి స్తూ వారిలో ఆర్థికంగా భరోసా నింపుతున్నది. టెస్టులు, స్కానింగ్ పేరిట ప్రైవేట్ ల్యాబ్లు అడ్డూఅదుపు లేకుండా చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట పడేలా సామాన్యులకు మేలు చేస్తోంది. ఇందుకుగాను ప్రతి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రూ.3కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటుచేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో వేలకు వేలు వసూలు చేస్తుండగా ఇందులో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తుండడంతో వేలాది మంది వినియోగించుకుంటున్నారు. ఫలితంగా ఒకప్పు డు సర్కార్ వైద్యంపై ఉన్న భయం పోయి.. పరీక్షలు, చికిత్సల కోసం పోటీపడే పరిస్థితులు వచ్చాయి. కచ్చితత్వం, పారదర్శకతతో మెరుగైన వైద్య సేవలందిస్తుండడంతో ప్రజల్లో మరింత నమ్మకం పెరిగింది.
వేలాది మంది టెస్టులు..
టీ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా వేలాది మంది ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు. జనగామ జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్ జూన్ 14న ప్రారంభం కాగా, ఆదివారం వరకు మొత్తం 536మందికి 1,724 టెస్టులు చేశారు. సుమారు రూ.2.68 లక్షల విలువై పరీక్షలు ఉచితంగా అందించారు. ములుగు జిల్లాకేంద్రంలో టీ డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటుకావడం ఏజెన్సీ ప్రాంతవాసులకు ఎంతో ఊరటనిస్తోంది. జిల్లాలో జూన్ 9న సేవలు అందుబాటులోకి రాగా, ఇప్పటివరకు 2,781 మంది నుంచి 3,787 నమూనాలను సేకరించి 11,028 టెస్టుల రిపోర్టులను అందించారు. తద్వారా సుమారు రూ.3లక్షల విలువైన పరీక్షలు ఉచితంగా చేశారు. అలాగే మహబూబాబాద్లో డయాగ్నస్టిక్ సేవలను మే 17న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించగా, ఇప్పటివరకు 5వేల మందికి 11,594 రకాల పరీక్షలు చేశారు. వీటి విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. శాంపిళ్లు సేకరించేందుకు జిల్లాలోని 24 పీహెచ్సీలకు, ఒక ఏరియా హాస్పిటల్కు ఐదు రూట్లు ఏర్పాటు చేశారు. రూట్-1లో మహబుబాబాద్, తొర్రూరు, నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం, రూట్-2లో మరిపెడ, దంతాలపల్లి, ఉగంపల్లి, కురవి, రూట్-3లో బయ్యారం, గంధంపల్లి, ముల్కనూరు, గార్ల, డోర్నకల్, బలపాల, రూట్ -4 లో కోమట్లడూడెం, గంగారం, కొత్తగూడ, గూడూరు(సీహెచ్సీ) రూట్-5 లో అయోధ్యాపురం, తీగలవేణి, కంబాలపల్లి, మల్యాల, యూపీహెచ్సీలు ఉన్నాయి. ఒక్కో వాహనం నాలుగు నుంచి ఐదు పీహెచ్సీలలోని సుమారు 100 నుంచి 130 వరకు రక్త నమునాలను సేకరించి ప్రతి రోజు మధ్యాహ్నం వరకు డయాగ్నస్టిక్ కేంద్రానికి తరలిస్తారు. పరీక్షలు చేసిన తర్వాత రిపోర్ట్ను సెల్ఫోన్ సందేశం ద్వారా రోగులతో పాటు సంబంధిత ఆరోగ్య కేంద్రాల వైద్యులకు పంపుతారు.
ఒక్కొక్కరికి రూ.5వేల విలువైన పరీక్షలు..
ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షలు ప్రైవేట్తో పోలిస్తే ఖరీదైనవి. ఒక్కొక్కరికి రూ.4,500 నుంచి రూ.5వేల విలువైన వివిధ రకాల పరీక్షలను సర్కారు ఉచితంగా చేస్తున్నది. లాక్టెడ్ డీ హైడ్రోజినేస్(ఎల్డీహెచ్) పరీక్ష కణజాలాల్లో కలిగే నష్టాన్ని అంచనా వేస్తుండగా, అంటువ్యాధులు, రక్తహీనతలు, మూత్రపిండాల వ్యాధి, కాలేయ ఫంక్షనింగ్ పరీక్షలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. యాంటీబాడీస్ మన శరీరంలో ఎంతమేరకు ఉన్నాయో గుర్తించడం సహా డీ డైమర్ పరీక్షతో గుండె సంబంధ వ్యాధులను గుర్తించడం (రక్తం గడ్డకట్టిన సందర్భంలో డీ డైమర్ పరీక్ష చేస్తారు) ఈ ల్యాబ్లో పేదలందరికీ ఉచితంగానే అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలోని 30 పడకల దవాఖానలు సహా అర్బన్ పీహెచ్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని రోగుల కోసం జనగామ ల్యాబొరేటరీ పనిచేస్తుంది. అయితే ఈ డయాగ్నస్టిక్ కేంద్రంలో నేరుగా ఎవరికీ రక్త పరీక్షలు చేయరు. మండలాల పరిధిలోని ప్రభుత్వ దవాఖానల నుంచి వచ్చే శాంపిళ్లను పరీక్ష చేసి ఆన్లైన్ ద్వారా రిపోర్టు పంపిస్తారు. అనారోగ్యంతో బాధపడే వారు వైద్యుల సలహా మేరకు స్థానిక పీహెచ్సీ, 30 పడకల ఆస్పత్రి, అర్బన్ పీహెచ్సీకి వెళ్లి శాంపిల్ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా ప్రధాన దవాఖానలో అందుబాటులో లేని పరీక్షలను మాత్రమే ల్యాబొరేటరీలో చేస్తారు. క్లస్టర్ పరిధిలోని పీహెచ్సీల నుంచి రక్త నమూనాలను ఇక్కడకు ప్రత్యేక వాహనంలో తరలిస్తారు.
ఈ పరీక్షలు చేయించుకోవచ్చు..
డయాబెటిక్, థైరాయిడ్, లివర్ ఫంక్షనింగ్, రీనల్ ఫంక్షన్, లిపిడ్, సీరం, ఎలక్ట్రోలైట్స్, పాథాలజీ(సీబీపీ), మైక్రో బయోలజీ, హిమటాలజీ, బయోకెమిస్ట్రి అనలైజర్, మూత్ర పరీక్షలు, డెం గ్యూ, చికున్గున్యా, లిపిడ్ ఫ్రొఫైల్ (గుండెకు సంబంధించి), కిడ్ని, కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ), బ్యాక్టీరియా(అన్ని రకాలు)కు సంబంధించిన పరీక్షలు చేస్తారు. ప్రైవేట్ ల్యాబొరేటరీలో ఒక వ్యక్తికి 57 రకాల పరీక్షలు నిర్వహించాల్సి వస్తే రూ.11,028 వరకు చార్జీ వసూలు చేస్తారు. ఏదైనా జబ్బుచేసి ప్రైవేట్ వైద్యుడి వద్దకు కనీసం రూ.4,500 నుంచి రూ.5వేల వరకు ల్యాబ్ టెస్టులకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లలో మాత్రం ఖరీదైన హెచ్మీఏ-1సీ, డీ డైమర్, ఎల్డీహెచ్ వంటి సేవలు ఉచితం గా అందిస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నది. హెచ్బీఏ1సీ (హిమోగ్లోబిన్ ఏ1సీ లేదా ైగ్లెకేటెడ్ హి మోగ్లోబిన్)గా పిలుస్తారు. డయాబెటిక్(షుగర్) ఎంత వరకు ఉందని నిర్ధారించడంతోపాటు పరగడుపున ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో కలిసి టైప్-2 షుగర్(మూడు నెలల) నిర్ధారణ పరీక్షలను ప్రభు త్వ కేంద్రంలో విజయవంతంగా చేస్తున్నారు.
పేదలకు ఎంతో మేలు..
డయాగ్నస్టిక్ కేంద్రం లో 57 రకాల వైద్య పరీక్షలు చేస్తు న్నాం. ఇప్పటివరకు 5వేల మంది రోగులకు 11,954 టెస్టులు చేశాం. ప్రతిరోజు 5 రూట్ల ద్వారా 24 పీహెచ్సీలు, ఒక ఏరియా హాస్పిటల్ నుంచి శాంపిళ్లు సేకరిస్తాం. పరీక్షించిన తర్వాత రోగులకు మొబైల్ ఎస్ఎంస్ ద్వారా రిపోర్ట్లు పంపిస్తున్నాం. గతంలో టెస్టుల కోసం ప్రైవేట్ దవాఖానలకు, కొందరు ఎంజీఎం వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉచితంగా టెస్టులు చేయడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది.