వ్యవసాయ యూనివర్సిటీ : కోత దశలో ఉన్న మిర్చి పంటలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు సాధించవచ్చని ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కళాశాల శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిరోష అన్నారు. పంట చివరి దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. తెలంగాణలో పండే మిర్చికి భారీ డిమాండ్ ఉంది. మిరప సాగులో తెలంగాణది రెండో స్థానం. అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకొని ఎగుమతులు పెంచాలంటే పంట కోత, శుభ్రపర్చే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాధారంగా సాగు చేస్తే మూడు నుంచి నాలుగు, నీటి ఆధారంగా సాగు చేస్తే ఆరు నుంచి ఎనిమిది కోతలు మాత్రమే కోయాలి. ఏ కోత కాయలను వేర్వేరుగా భద్రపర్చాలి. మొక్కలపైనే పండ్లను ఎండనివ్వాలి. పూర్తిగా పండిన తర్వాతే కోయాలి. మరీ ఎక్కువగా పండనిస్తే ముడతలు కనిపిస్తాయి. బాగా ఎండనిస్తే రంగు తగ్గి పండ్లు నాణ్యత కోల్పోతాయి. పొడి వాతావరణంలోనే కాయలు కోయాలి. కోసిన కాయలను కుప్పగా పోయాలి. అప్పుడే అన్ని కాయలు సమానంగా పండుతాయి. మిరప పండ్లను పాలిథీన్ పట్టాలు లేదా సిమెంట్ గచ్చుపై ఎండబెట్టాలి. పండ్లలో 70 నుంచి 80 శాతం వరకు ఉండే తేమ 10 నుంచి 11 శాతం వచ్చే వరకు ఆరనివ్వాలి. తాలు, మచ్చ కాయలను వేరు చేయాలి. బాగా ఎండిన తర్వాత గోనె సంచుల్లో కాయలను నింపాలి. తేమ తగులకుండా వరి పొట్టు లేదా చెక్కబల్లలపై బస్తాలను ఉంచాలి. అవకాశం ఉంటే శీతల గిడ్డంగుల్లో భద్రపరిస్తే కాయ నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.