కుత్బుల్లాపూర్,మే15 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజా సంక్షేమానికి పెద్ద పీటను వేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలో రూ.28 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా, కమ్యూనీటి హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తూనే ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సుచిత్ర జంక్షన్ పెద్ద ఎత్తున ప్లై ఓవర్లు
నిర్మించబోతున్నట్లు వివరించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని, కాలనీవాసులు సమిష్టిగా వాటి ఏర్పాటుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించుకొని ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ రమేశ్, కాలనీ అధ్యక్షులు కుంట సిద్దిరాములు, కార్యదర్శి నగేశ్రెడ్డి, కార్యదర్శి రాజు, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.